వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శ పేరుతో సర్కస్ ఫీట్ చేశారని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరపించారు. ముఖ్యంగా, మామిడి కాయలను దొంగచాటుగా తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడం వైసీపీ వాళ్ల సంస్కారమన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ ఇటీవల చేపట్టిన మామిడి రైతుల పరామర్శ యాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో మనిషిని, ఇప్పుడు మామిడి కాయలను జగన్ తొక్కించారని ఆరోపించారు. ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసని ఆయన అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. 2024-25లో ధాన్యం సొమ్ము వంద శాతం రైతుల ఖాతాల్లోకి జమ చేశామని, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు.
కేవలం ఫోటోలు, వీడియోల కోసం వైసీపీ నేతలు మామిడి పంటను ట్రాక్టరుతో తొక్కించడం దుర్మార్గమన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం, పోలీసులతో పాటు వ్యవస్థలో ఉన్న వ్యక్తులను బెదిరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.