Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

వ్యవసాయ రంగంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం... మంత్రి సోమిరెడ్డి

అమరావతి : రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరరంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి మీడి

Advertiesment
AP Agricultural minister
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (16:50 IST)
అమరావతి : రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరరంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి మీడియాతో మాట్లాడారు. నవంబర్ 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు విశాఖలో జాతీయ స్థాయి వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సు ముగింపు రోజు 17న బిల్ గేట్స్ వస్తారని చెప్పారు. 1996లో బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చారని, 21 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నారని అన్నారు. 
 
వ్యవసాయ రంగంలో పంటల సమాచార సేకరణ, భూసార పరిక్షల నిర్వహణ వంటి వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ రాష్ట్రం ముందుండి ఓ రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. సాగు చేసే భూమిలో దాదాపు 95 శాతం భూసార పరిక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పరిశీలించి, టెక్నాలజీ వినియోగంలో ఏపీ ముందుందని చెప్పినట్లు పేర్కొన్నారు. విశాఖ సదస్సులో వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, సాంకేతిక సంస్థల వారు పాల్గొంటారని చెప్పారు. ఈ సదస్సుకు ఏ రంగాల వారిని ఆహ్వానించాలన్న అంశాన్ని చర్చించడానికి వారు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. 
 
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరిగేందుకు సాంకేతికత, చిన్న, సన్నకారు రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసేందుకు కావలసిన సహకారం ఈ ఫౌండేషన్ అందిస్తుందని వివరించారు. సదస్సులో ఏపీ ప్రభుత్వం- ఫౌండేషన్ మధ్య ఒప్పందం జరుగుతుందన్నారు. ఈ ఫౌండేషన్ లాభాపేక్షకలిగిన వ్యాపార సంస్థ కాదని, స్వచ్చంద సంస్థని తెలిపారు. ఆఫ్రికాలో వ్యవసాయ రంగం అభివృద్ధిలో మంచి ఫలితాలు సాధించిన ఈ ఫౌండేషన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పట్ల ఆసక్తి చూపించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పరిశ్రమలు నెలకొల్పితే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. విశాఖ సదస్సు ఇటు రైతులకు, అటు వ్యవసాయ అనుబంధ రంగాల పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోకరంగా ఉంటుందని మంత్రి అన్నారు.
 
వ్యవసాయ పరిశోధనా కేంద్రం వంటిది ఏపీ
వివిధ వాతావరణ పరిస్థితులు, పలు రకాల పంటలు పండే ఆంధ్రప్రదేశ్ ఒక పరిశోధనా కేంద్రం వంటిదని ఫౌండేషన్ ఆసియా చీఫ్ డాక్టర్ పుర్వి మెహతా చెప్పారు. దేశంలోని ఒరిస్సా, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని అక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇక్కడ సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయ దిగుబడులు అధికంగా సాధించడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలు రావడానికి మార్కెటింగ్ లో మెళకువలు నేర్పే విషయంలో సహకరిస్తామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో భూసారం, వాతావరణం, మౌలిక వసతుల ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని పుర్వి మెహతా చెప్పారు.
 
 సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించి సలహాలు అందించే అంతర్జాతీయ సంస్థ డాల్బెర్గ భాగస్వామి వరద్ పాండే మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సంబంధించి పూర్తి సమాచార సేకరణ, సాంకేతిక వినియోగం, రైతులకు రుణ సౌకర్యం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఆల్ లైన్ మార్కెటింగ్ వంటి అంశాలలో తమ సహకారం అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిల్ గేట్స్‌ల అమూల్యమైన సలహాలతో తాము ముందుకు వెళతామన్నారు.
 
ఈ ఫౌండేషన్ ఆఫ్రికా వంటి దేశంలో పరిశోధనలు చేసి ఫలితాలు సాధించిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ చెప్పారు. పంటలకు నేల లక్షణాలు ముఖ్యమని, ఆఫ్రికా సాయిల్ సంస్థలను నెలకొల్పి, అక్కడ వివిధ ప్రాంతాల్లో మట్టిని సేకరించి, పరీక్షించి భూసారాన్ని మెరుగుపరిచారని వివరించారు. ఆఫ్రికా వంటి దేశంలో ఫలితాలు సాధించడం గొప్ప విజయంగా వర్ణించారు. మన రాష్ట్రంలో కూడా నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలు, లేని ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి తగిన సహాయం, సహకారాలు అందిస్తారని తెలిపారు. ప్రస్తుతం మనం అందించిన సాయిల్ హెల్త్ కార్డుల స్థానంలో డిజిటల్ సాయిల్ కార్డులు ఇస్తారన్నారు. అత్యాధునిక సాంకేతికత అందించడంతోపాటు వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి సహకారం అందించడంలో భాగంగా విశాఖలో సదస్సు నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఆ ఛాన్స్ మిస్సయ్యాడు.. రాజకీయ సన్యాసమే బెస్ట్: జేసీ దివాకర్ రెడ్డి