Publish Date: Fri, 01 May 2026 (10:13 IST)
Updated Date: Fri, 01 May 2026 (10:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలో ఉన్నత పాఠశాల సున్నాశాతం ఫలితాలను సాధించింది. ఈ పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు ఉండగా ఆ నలుగురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పైగా, ఈ నలుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం గమనార్హం. చివరకు సున్నా శాతం ఫలితంతో అపకీర్తిని మూటగట్టుకుంది.
జిల్లాలోని గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చదువుతున్న నలుగురు విద్యార్థులూ ఉత్తీర్ణత సాధించలేదు. గతేడాది జూన్లో అప్పటివరకు యూపీ పాఠశాలగా ఉన్న పాఠశాలను విద్యాశాఖ అధికారులు ఉన్నతీకరించారు. అంతకుముందు నలుగురు ఉపాధ్యాయులు ఉండగా ఈవిద్యా సంవత్సరం మరో ముగ్గురిని కేటాయించారు. వీరి బోధనా తీరు విద్యార్థుల ఫలితాల్లో చూపలేకపోయింది.
నలుగురు విద్యార్థుల్లో తెలుగులో ఒకరు, సైన్స్లో ఒకరు, సాంఘిక శాస్త్రంలో మిగిలిన ఇద్దరు అనుత్తీర్ణులయ్యారు. దీనిపై ఎంఈఓ రవినాయక్ స్పందిస్తూ పది పరీక్షలు రాసిన విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధిస్తారనుకున్నాం, ఫలితాలు అనుకున్నట్లు రాలేదన్నారు. చివరకు ఉపాధ్యాయులంతా వారి ప్రయత్నం వారు చేశారని చెప్పుకొచ్చారు.