Publish Date: Tue, 26 Oct 2021 (16:43 IST)
Updated Date: Tue, 26 Oct 2021 (16:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఏర్పడిందని తెలిపింది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో ఒక అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది.
దీంతోపాటు ఉపరితల ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడినట్లు తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు వెల్లడించింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచనలు చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. గురువారం దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. గురువారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.