ఈ నెల 13వ తేదీన వాయువ్య పశ్చిమ ధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రభావం కారణంగా ఈ నెల 11వ తేదీ నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆదివారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
11వ తేదీ సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 12న కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 13న గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఆగస్టు 14న ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.