Publish Date: Fri, 19 Feb 2021 (15:21 IST)
Updated Date: Fri, 19 Feb 2021 (15:21 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులోభాగంగా నాలుగో దశ పోలింగ్ ఈ నెల 21వ తేదీన జరుగనుంది. అయితే, నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు. ఓట్ల లెక్కింపు వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
జనరేటర్లు, ఇన్వెర్టర్లు వంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇతరులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. పది లోపు ఓట్ల తేడా ఉన్న చోటే రీ కౌంటింగ్కు ఆదేశించాలన్న ఎస్ఈసీ.. ఓట్ల లెక్కింపు వేళ సమాచారం లీక్ కాకుండా చూడాలన్నారు. లెక్కింపు కేంద్రాల్లో వీడియో ఫుటేజీ భద్రపరచాలని ఎస్ఈసీ ఆదేశాల్లో పేర్కొన్నారు.