Publish Date: Sun, 08 Sep 2024 (16:23 IST)
Updated Date: Sun, 08 Sep 2024 (16:46 IST)
గతవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. బుడమేరు వాగు పొంగి పొర్లడంతో సమీప ప్రాంతాల్లో నీరు ప్రవహించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.
కాగా, బుడమేరు ప్రాంతాల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, ఇతర అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బుడమేరు చుట్టు పక్కల నివాస ప్రాంతాలను భవిష్యత్తులో వరదలు ముంచెత్తకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుడమేరుపై రిటైనింగ్వాల్ నిర్మించాలని ఆలోచిస్తోందన్నారు.
అదనపు ముంపునకు గురికాకుండా బుడమేరు కట్టల ఎత్తు పెంచాలని ఇప్పటికే జలవనరుల శాఖకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని నారాయణ ప్రస్తావించారు. నారాయణ, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆదివారం నగరంలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు.
స్థానికులు పరిస్థితి నుంచి పూర్తిగా కోలుకునేందుకు తమ వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్థానికులకు హామీ ఇచ్చారు.