ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. ఇందులో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ అమలు కోసం నిధులను భారీగా కేటాయించారు. దీంతో ఏపీ వార్షిక బడ్జెట్ తొలిసారి రూ.3 వేల కోట్లు దాటింది.
ముఖ్యంగా తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు కేటాయించగా, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చేందుకు వీలుగా రూ.6,300 కోట్లు కేటాయించారు.
తల్లికి వందనం పథకం కింద రూ.9,407 కోట్లు కేటాయించడంతో పాటు ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ సాయం అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తారు.
అలాగే, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించేందుకు వీలుగా ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిధులు కేటాయించారు. ప్రతి కుటుంబానికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు రూ.25 లక్షల బీమా సదుపాయం వర్తింపజేయనున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామని ప్రకటించారు.
అలాగే, ఎస్సీ, ఎస్టీ, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్టు వెల్లడించారు. చేపల వేట నిషేధం కాలంలో జాలర్లకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా దీం 2.0 పథకం కింద నిధులు కేటాయింపు జరిపామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.