Publish Date: Sun, 06 Mar 2022 (12:41 IST)
Updated Date: Sun, 06 Mar 2022 (12:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందులోభాగంగా, సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలవుతాయి.
ఈ సమావేశాల్లో రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పుపై సమగ్రంగా చర్చించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఓ లేఖ రాశారు. దీంతో హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది.
మరోవైపు, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని విపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. మరోవైపు, అధికార పార్టీ మాత్రం హైకోర్టు తీర్పును తుంగలో తొక్కి తాము అనుకున్న ప్రకారం మూడు రాజధానుల నిర్మాణానికి కట్టుబడి ముందుకు సాగాలని భావిస్తుంది. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి.