Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉపాధిహామీ కూలీలకు అదనంగా 30 శాతం వేసవిభత్యం

ఉపాధిహామీ కూలీలకు అదనంగా 30 శాతం వేసవిభత్యం
, సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:33 IST)
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల వల్ల లాక్ డౌన్ తో పనులు లేక అల్లాడుతున్న కూలీలకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనల వల్ల ఇళ్ళనుంచి బయటకు రాలేక, చేసుకునేందుకు పనులు లేక గ్రామీణ ప్రాంత  కూలీలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటన్నారు. ఈ నేపథ్యంలో వారికి పనులు కల్పించడం, లాక్ డౌన్ నిబంధనలకు ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా వుండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణను రూపొందించింది.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భౌతికదూరంను పాటిస్తూనే ఉపాధి హామీ పనులు చేసుకోవడం ద్వారా పేదల ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. 
 
గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత
ఉపాధి హామీ కింద వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వేతనాల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు కార్యాచరణను రూపొందించారు.  ప్రధానంగా ఉద్యాన పంటలు, మల్బరీ తోటల పెంపకం, పశు గ్రాస పెంపకం వంటి వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇచ్చారు.

దీనితో పాటు కాలువలు, చెరువుల తవ్వకం వంటి  ఇతర సామాజిక పనులను స్థానిక డిమాండ్ ఆధారంగా చేపట్టాలని నిర్ధేశించారు. ఈ పనులు చేసే కూలీలు ఖచ్చితంగా భౌతిక దూరంతో పాటు కరోనా వ్యాప్తి నిరోదక నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది.

ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలు నడిచి వెళ్ళే దూరంలోనే సాధ్యమైనంత వరకు పనులు కల్పించనున్నారు. వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు ఉపయోగపడేలా వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆయా రంగాలపై ఆధారపడిన వారికి ప్రభుత్వం చేయూతను అందించనుంది.

ఉపాధి హామీ కూలీలకు చెల్లించటానికి నిధులకు ఎలాంటి కొరత లేనందున, ఉపాధి హామీ సిబ్బంది కూడా వ్యక్తిగతంగా తగు రక్షణా చర్యలు తీసుకుంటూ ఈ విపత్తు సమయంలో గ్రామాల్లో పనులు కల్పించడం, గ్రామీణ పేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా  కల్లెక్టర్లను, డ్వామా ప్రాజెక్ట్  డైరెక్టర్ లను ఆదేశించింది.   
 
ఉపాధిహామీ కూలీలకు అదనంగా 30 శాతం వేసవిభత్యం  
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు నరేగా నిబందనల ప్రకారం చెల్లిస్తున్న కూలితో పాటు అదనంగా వేసవి భత్యంను అందచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య ఉపాధి హామీ కూలీలు గరిష్ట కూలీని పొందే స్థాయిలో పనులు చేయలేని పరిస్థితి వుంటుంది.

దానిని దృష్టిలో పెట్టుకుని వారు చేసిన కూలీకి అదనంగా ముప్పై శాతం వరకు వేసవి భత్యంను పొందేందుకు వీలు కల్పించారు. దీనివల్ల తక్కువ పనిచేసినా కూడా వేసవి భత్యం జత అవ్వడం వల్ల కూలి నష్టపోకుండా వుంటుంది. ఉపాధి హామీ కూలీలు గరిష్టంగా రోజుకు 237 రూపాయల వరకు కూలిగా పొందేందుకు అవకాశం వుంది.

రోజువారీ వారు చేసిన పనిని లెక్కించి అందుకు అనుగుణంగా కూలీ చెల్లిస్తారు. దీనిలోనే ముప్పై శాతం వరకు వేసవిభత్యంను పొందేందుకు సైతం వీలు కల్పించారు. 
 
ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా కోటి పనిదినాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు అదనంగా కోటి పనిదినాలు లభించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 20 కోట్ల పనిదినాలు మాత్రమే రాష్ట్రంకు కేటాయించగా, ఈ ఏడాది అదనంగా మరో కోటి పనిదినాలను కేటాయించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సుముఖత వ్యక్తం చేసింది.

రాష్ట్రనికి చెందిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల ముందుచూపుతో తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలోని కూలీలకు ఈ అదనపు ప్రయోజనం లభించింది. గత ఆర్దిక సంవత్సరంలో వేతన దారులకు రూ. 20.08 కోట్ల పనిదినాలు కల్పించి రూ 4084.86 కోట్లు వేతన రూపంలో చెల్లించారు. 

ఉపాధి హామీ పధకం క్రింద గత ఆర్దిక సంవత్సరంలో మెటీరియల్ రూపంలో రూ  2624.18 లు, వేతన రూపంలో 4084.86 కోట్లు కలిపి మొత్తం రూ 6709.04 లు వ్యయం చేశారు. ఉపాధి హామీ నిబంధననల ప్రకారం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో  జరిగే మొత్తం వ్యయంలో కనీసం 65% వ్యయం సహజ వనరుల యాజమాన్య పనులపై జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
ఉపాధి హామీ నిధులకు కొరత లేదు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కరోనా కారణంగా దినసరి కూలీలు పనులు లేక అల్లాడుతున్న తరుణంలో వారిని ఆదుకునేందుకు ఉపాధి హామీ పనులను ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఉపాధి హామీ కూలీలకు చెల్లించేందుకు నిధుల కొరత లేదని వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించే వేతనాల కోసం 2020-21 ఆర్ధిక సంవత్సరంకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.2149.78 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఉపాధి హామీ కోసం ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈనెల 15వ తేదీ వరకు ప్రభుత్వం ఉపాధి కూలీలకు వేతనాల రూపంలో రూ. 494.3 కోట్లు చెల్లించిందని తెలిపారు.

ఈ జూన్ మాసాంతం వరకూ వేతన దారులకు చెల్లించటానికి మరో రూ.1688.97 కోట్ల నిధులు మనకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 2019-2020 లో రూ. 211 గా ఉన్న దినసరి వేతనాన్ని 2020-21 లో  అదనంగా రూ. 26 లు పెంచి  రోజుకి  రూ. 237 లు   చొప్పున చెల్లించటం జరుగుతుందని అన్నారు.

తద్వారా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రూ. 546 కోట్లు అదనంగా రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు వేతన రూపంలో అందుతుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ప్రభావం తక్కువ ఉన్న ప్రాంతాల్లో సడలింపులు :: పనిచేసేవి.. అనుమతించనివి...