నవ్యాంధ్ర రాజధాని అమరావతి జనసంద్రంగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజధాని నిర్మాణ పునఃప్రారంభం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. ఆయన చేతుల మీదుగా ఈ నిర్మాణ పనులు పునఃప్రారంభంకానున్నాయి. అయితే, ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచే రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అమరావతికి చేరుకున్నారు.
కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడి గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. వేడుకకు హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటుచేసింది. తాగునీరు, తాత్కాలిక ఆస్పత్రి, అంబులెన్స్లను అందుబాటులో ఉంచింది.
సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రదర్శనలు సభికులలో ఉత్సాహాన్ని నింపాయి. రాజధాని అమరావతి ప్రస్థానాన్ని పునఃప్రారంభించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.