Publish Date: Tue, 28 Jan 2020 (15:26 IST)
Updated Date: Tue, 28 Jan 2020 (15:27 IST)
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేస్తోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. కృష్ణా నదిలో రాజధాని మహిళలు, రైతులు జలదీక్షకు దిగారు. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ రాజధాని అంటూ నినాదాలు చేశారు.
శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఫొటో పట్టుకుని ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. 42 రోజులుగా తాము నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పోరాటాలు చేసయినా తాము హక్కులను కాపాడుకుంటామని చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు.
42వ రోజు రాజధానిలో ఆందోళనలు
రాజధాని కోసం భూములు ఇచ్చిన మమ్మలను ప్రభుత్వం అవమానిస్తుందని ఆ ప్రాంత మహిళా రైతులు ఆరోపించారు. వీరు చేస్తున్న ఆందోళన మంగళవారంతో 42వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
రాజన్న రాజ్యం వస్తుందంటే నమ్మి ఓట్లేశాం.
ఆనాడు గ్రామగ్రామానికి వచ్చి ముద్దులు పెట్టిన జగన్.. నేడు గుద్దులు గుద్దుతున్నాడు. సిఎంను మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారు. అమరావతి రాజధానిగా 30వేల ఎకరాలు కావాలన్నది వాస్తవం కాదా.
మంత్రులు, ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడుతుంటే ఎందుకు నియంత్రించడం లేదు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి.. లేకుంటే ఆత్మహత్యలే మాకు శరణ్యం. మూడు రాజధానుల కోసం వైసిపి కార్యకర్తలుతో పోటీ ధర్నాలు చేయిస్తారా.
విశాఖ ప్రజలు వచ్చి రాజధాని కావాలని నిన్ను అడిగారా. ప్రభుత్వ ధనంతో ప్రజలపై పోరాడమని ఐదు కోట్లు కేటాయిస్తారా. ఇలాంటి నియంత పాలన ఎక్కడా చూడలేదు. అనుకున్నది జరగపోతే వ్యవస్థలను రద్దు చేయడం దారుణం. అమరావతి ఎన్ని రోజులైనా పోరాటం కొనసాగిస్తాం.