Publish Date: Wed, 24 Mar 2021 (12:55 IST)
Updated Date: Wed, 24 Mar 2021 (12:57 IST)
తిరుమలలో మంగళవారం సుమారు ఆరడుగుల పొడవున్న నాగుపాము భక్తులను హడలెత్తించింది. సన్నిధానం ప్రాంతంలోని చైర్మన్ కార్యాలయం సమీపానికి పాము రావడాన్ని గుర్తించిన భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న టీటీడీ ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన వద్దనున్న పరికరాలతో పామును పట్టుకుని, దట్టమైన అడవిలో వదిలిపెట్టారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా 50 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 52,414 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.98 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 24,111 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.