Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో మరో 8 అనుమానిత కరోనా కేసులు - ఎయిర్‌పోర్టుల్లో తప్పనిసరి తనిఖీలు

హైదరాబాద్‌లో మరో 8 అనుమానిత కరోనా కేసులు - ఎయిర్‌పోర్టుల్లో తప్పనిసరి తనిఖీలు
, మంగళవారం, 3 మార్చి 2020 (15:06 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ కరోనా వైరస్ వెలుగు చూసింది. దుబాయ్ నుంచి వచ్చిన ఈ ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీకి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. దీంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా, ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. వీరంతా ఇటీవలే ఇటలీ, ఇండొనేషియా, ఇజ్రాయెల్, జపాన్‌ నుంచి వచ్చారు. కరోనా లక్షణాలు కనపడడంతో ఆసుపత్రిలో చేరారు. వీరి రక్త నమూనాలను సేకరించి పూణేకు పంపించారు. మరోవైపు, ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ బారిన పడి దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
అమెరికాను కలవరపెడుతున్న కరోనా 
ఇదిలావుంటే, అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. మృతులందరూ వాషింగ్టన్ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం. 
 
అమెరికా వ్యాప్తంగా మొత్తం 91 మందికి ఈ మహమ్మారి సోకింది. ఈ వివరాలను అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెల్లడించారు. వీరిలో 48 మంది విదేశాల నుంచి తిరిగొచ్చారని... మిగిలిన వారికి అమెరికాలోనే వైరస్ సోకిందని ఆయన వివరించారు. 
 
అలాగే, కరోనా వైరస్‌ చికిత్సపై స్పందిస్తూ, వేసవి లేదా వర్షాకాలం ఆరంభం నాటికి కరోనా వైరస్‌కు చికిత్స అందుబాటులోకి వస్తుందన్నారు. అమెరికాలో వేసవి జూన్‌లో ప్రారంభమవుతుందన్నారు. 
 
ఇప్పటికే పలు రకాల ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం మాత్రం ఈ యేడాది చివరి వరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు. గత శనివారం కరోనా వైరస్‌కు సంబంధించి తొలి మరణం సంభవించింది.
 
భారత్ ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ సెంటర్లు 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కరోనా స్క్రీనింగ్‌ కేంద్రాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. 
 
ముఖ్యంగా, చైనా, సింగపూర్, మలేషియా, ఇండొనేషియాతో పాటు పలు దేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ప్రయాణికుల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ వచ్చిందట... హ, హ్హ, హ్హ్హ, ఛార్మికి ఏమైంది?