Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

AP Assembly Election 2024 : చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ!!

pawan - chandrababu

PNR

, గురువారం, 21 మార్చి 2024 (13:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారం సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇందులో ఇరు పార్టీల అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా, ఈ కూటమి ఏర్పాటైన తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరికొందరి పేర్లు ప్రకటించాల్సివుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
కాగా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనలో యమజోరు మీదున్న టీడీపీ ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించగా ఇక మిగిలిన అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కసరత్తు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తికాగా అధికారిక ప్రకటనే తరువాయి అన్నట్లుగా పార్టీలో పరిస్థితులు కన్పిస్తున్నాయి.
 
టీడీపీ ప్రకటించాల్సి ఉన్న 16 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల్ని ఇవాళ లేదా రేపట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మొన్ననే ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించాలని చంద్రబాబు భావించారు. అయితే బీజేపీతో సీట్ల సర్దుబాటు చర్చల కారణంగా వాయిదా పడినట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ టెక్నాలజీపై అపార నమ్మకం కలిగింది.. అప్పటి నుంచే రిస్క్ తీసుకుంటున్నా : ఆనంద్ మహీంద్రా