Publish Date: Thu, 11 Apr 2019 (08:44 IST)
Updated Date: Thu, 11 Apr 2019 (08:46 IST)
అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి కె.మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో వీరంగం సృష్టించాడు. గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రం బయట ఓటింగ్ కంపార్ట్మెంట్లో నియోజకవర్గం పేరు సరిగా రాయలేదనీ, అలాగే, ఈవీఎంలో తన పేరును కింద రాశారన్న ఆగ్రహంతో ఈ పనికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికి బూత్ లోపలికి వచ్చిన మధుసూదన్ గుప్తా, అక్కడున్న ఇతర పార్టీల ఏజంట్లతో గొడవ పడటమేకాకుండా, ఈవీఎంను నేలకేసి కొట్టాడు. దీంతో అది పని చేయకుండా పోయింది. అంతకుముందు ఆయన ఓటింగ్ కంపార్ట్ మెంట్లలో నియోజకవర్గం పేరును సరిగా రాయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను పోలింగ్ కేంద్రం నుంచి అరెస్టు చేసిన పోలీసు జీపులో ఎక్కించి తరలించారు. కాగా, గతంలో ఈయన ఎమ్మెల్యేగా కూడా పని చేశారు.