Publish Date: Tue, 08 Nov 2022 (12:50 IST)
Updated Date: Tue, 08 Nov 2022 (12:51 IST)
ఈ నెల 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్టణం పర్యటనకు వస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7.25 గంటలకు విశాఖకు చేరుకుంటారు. 12వ తేదీ ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచే రూ.10,742 కోట్ల వ్యయంతో చేపట్టే ఐదు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికే పూర్తయిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఉదయం 10.30 గంటలకు 11.45 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరువుతారు.
ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని ప్రయాణించే రహదారికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటుచేస్తున్నారు.