Publish Date: Thu, 06 May 2021 (17:11 IST)
Updated Date: Thu, 06 May 2021 (17:12 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ చేతగాని పాలనను జనమే కాకుండా సొంత పార్టీ నేతలే ఎండగడుతున్నారని ఎద్దేవా చేశారు.
కరోనా కట్టడికి జగన్ సర్కార్ ఏమీ చేయలేదని, పనికిమాలిన పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని, ఈ విషయం సీఎం జగన్కు చెబితే, ఎక్కడ కక్షసాధింపులకు దిగుతారో అని ఎవరూ నోరు మెదపట్లేదని లోకేశ్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్ మూర్ఖత్వాన్ని, చేతగాని పాలనను, కరోనా వైఫల్యాన్ని వైసీపీ సీనియర్ నేతలే కుండబద్దలు కొడుతున్నారని విమర్శించారు. కరోనా నియంత్రణకి జగన్ ఏం చేశాడు? బొక్క చేశాడు... అంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పిల్లి మెడలో తొలి గంట గట్టారని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఇక ఆకుల సత్యనారాయణ వ్యాఖ్యలను కూడా లోకేశ్ ట్వీట్లో ఉటంకించారు. ప్రభుత్వం లాజిస్టిక్స్ మెయింటేన్ చేయడం లేదు. జగన్ చేతులెత్తేశాడు అన్న ఆకుల సత్యానారాయణ వ్యాఖ్యలను లోకేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
శవాల దహనం కోసం కూడా చందాలు వేసుకోవాల్సి వస్తుందని వైసీపీ నేతలే వాపోతున్నారని పేర్కొన్నారు. తాను జగన్ను విమర్శిస్తే ఉలిక్కి పడి, బూతుల మంత్రినో, పేటీఎం బ్యాచ్లను ఫేక్ ట్వీట్లతోనో దింపుతారని చురకలంటించారు. కానీ సొంత పార్టీ నేతలే సీఎం జగన్ను మూర్ఖపు రెడ్డి అని నర్మగర్భంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.