నవ్యాంధ్రలో లులు మహాల్ యాజమాన్యం భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, నవ్యాంధ్ర రాజధాని అమరావతి, ఆధ్యాత్మిక నగరం తిరుపతి, సాగర నగరం విశాఖపట్టణంలలో లులు మాల్స్ ఏర్పాటుకు లులు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు.
నిజానికి 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్టణం సాగర తీరంలో లులు మాల్ ఏర్పాటుకు స్థలం కేటాయించింది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అది కాస్త హైదరాబాద్ నగరానికి తరలిపోయింది. ఇపుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి వచ్చేందుకు లులు సంస్థ అంగీకారం తెలిపింది. వైజాగ్లో మాల్ ఏర్పాటుకు ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమ్మతి తెలియజేసింది. దానికి మంత్రివర్గం ఇపుడు ఆమోదం తెలిపింది.
కాగా, రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునఃప్రారంభించబోతున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని మంత్రివర్గానికి తెలియజేశారు. ఈ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు చంద్రబాబు మంగళవారం సాయంత్రం హస్తినకు వెళ్ళనున్నరు.
ఈ సందర్భంగా ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా చంద్రబాబు కలుస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న నిధుల జాబితాను తీసుకెళ్లనున్నారు. వాటికి నిధులు విడుదల చేయాల్సిందిగా విత్తమంత్రిని కోరనున్నారు.