Publish Date: Sat, 05 Nov 2022 (13:06 IST)
Updated Date: Sat, 05 Nov 2022 (13:10 IST)
నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 48 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఈ అల్పపీడనం ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంపై ప్రభావం చూపుతుందని, అలాగే, ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షాలతో పాటు మరోవైపు క్రమంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొనివుంది. కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల వర్షాలు పడుతుంటే, మరికొన్ని చోట్ల ఎండ ఠారెత్తిస్తుంది. ముఖ్యంగా, మన్యం, పాడేరు ఏజెన్సీల్లో చల్లటి వాతావరణం నెలకొనివుంది.