Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

Advertiesment
cognizant

ఐవీఆర్

, బుధవారం, 25 జూన్ 2025 (23:51 IST)
విశాఖపట్నం: టెక్నాలజీ, ప్రొఫెషనల్ సేవలలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన కాగ్నిజెంట్ (నాస్‌డాక్: సిటిఎస్ హెచ్ ), ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అత్యాధునిక క్యాంపస్‌ను అభివృద్ధి చేయడం ద్వారా  భారతదేశంలో కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్లు తెలుపుతూ తమ ప్రణాళికలను నేడు వెల్లచించింది.
 
ప్రతిపాదిత క్యాంపస్‌ను కాపులుప్పాడలోని ఐటి హిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 22 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. రూ. 1,583 కోట్ల పెట్టుబడితో, ఈ క్యాంపస్‌ను మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు, 8,000 కంటే ఎక్కువ ఉపాధి అవకాశాలను దీనిద్వారా సృష్టించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్‌లకు ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ డెలివరీలో కాగ్నిజెంట్ యొక్క అధునాతన సామర్థ్యాలను మరింతగా అందించనున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. "ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ అగ్రగామి సంస్థలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే మా లక్ష్యంకు అనుగుణంగా కాగ్నిజెంట్‌ను విశాఖపట్నంకు స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము" అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మానవ వనరుల అభివృద్ధి- ఆర్టీజి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ అన్నారు. "కాగ్నిజెంట్ ఇక్కడ తమ క్యాంపస్ ఏర్పాటు చేయటం ద్వారా  ఈ ప్రాంత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తుంది, అదే సమయంలో భవిష్యత్ శ్రామిక శక్తికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. స్మార్ట్ మౌలిక సదుపాయాలు, సులభతరమైన వ్యాపార నిర్వహణ సౌకర్యాలు  , ప్రగతిశీలరీతిలో  విధాన పరమైన మద్దతు అందించటం ద్వారా ఐటి- ఐటీఈఎస్ రంగాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అన్నారు. 
 
కాగ్నిజెంట్ సంస్థ, 2026 ప్రారంభంలో విశాఖపట్నంలో 800 మంది అసోసియేట్‌లకు సీటింగ్ సామర్థ్యంతో తాత్కాలిక సౌకర్యం నుండి కార్యకలాపాలను ప్రారంభించనుంది, 2029 ప్రారంభంలో క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు ఈ తరహాలోనే ఇక్కడ కార్యకలాపాలను నిర్వహించనుంది.
 
"మా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ విశాఖపట్నంలో మా క్యాంపస్‌ను ప్రారంభించనున్నామని వెల్లడించేందుకు మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్  ప్రగతిశీల లక్ష్యం  , స్థిరమైన మద్దతు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము" అని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ అన్నారు. "సాంకేతికంగా అత్యున్నత ప్రతిభావంతులతో పాటుగా విస్తృత స్థాయి  మౌలిక సదుపాయాలతో, రేపటి డిజిటల్ వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేయాలనే మా లక్ష్యంలో, ముఖ్యంగా భారతదేశంలోని టైర్ 2 నగరాల్లో బలమైన భాగస్వామిగా విశాఖపట్నం నిలుస్తుంది . ఈ పెట్టుబడి ద్వారా, ప్రభావవంతమైన కెరీర్ అవకాశాలను సృష్టించడం , ఈ ప్రాంతం కోసం శక్తివంతమైన, సమ్మిళిత , ఆవిష్కరణ-ఆధారిత భవిష్యత్తుకు దోహదపడాలని మేము ఎదురుచూస్తున్నాము" అని అన్నారు. 
 
2024 నుండి, భువనేశ్వర్, ఇండోర్‌లో కొత్త డెలివరీ కేంద్రాలను మరియు గుజరాత్‌లోని గిఫ్ట్  నగరంలో ఒక టెక్‌ఫిన్ కేంద్రాన్ని కాగ్నిజెంట్  ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు భవిష్యత్తుకు మద్దతు ఇవ్వడానికి, చురుకుదనం, నైపుణ్యం, సహకారం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, అత్యుత్తమ శ్రేణి ఉద్యోగి అనుభవాన్ని అందించడానికి రూపొందించబడ్డాయి.
 
కాగ్నిజెంట్ యొక్క గ్లోబల్ డెలివరీకి భారతదేశం కేంద్రంగా ఉంది, దాని 336,300 మంది అసోసియేట్‌లలో 70% కంటే ఎక్కువ మంది భారతదేశంలోనే ఉన్నారు. విశాఖపట్నం విస్తరణ బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ-ఎన్ సి ఆర్, గిఫ్ట్ సిటీ, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, కోల్‌కతా, మంగళూరు, ముంబై మరియు పూణేలలో కాగ్నిజెంట్ యొక్క బలమైన కార్యాచరణ ఉనికిపై నిర్మించబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన