ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీకి చెందిన పొగాకు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కష్టాలు జగన్కు ఏం తెలుసని వారు ప్రశ్నించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నసమయంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగుబయటపెట్టని జగన్.. ఇపుడు పరామర్శల పేరుతో రోడ్ల వెంబడి తిరగడం, రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందని వారు మండిపడుతున్నారు. ఇదే అంశంపై వారు జగన్కు ఓ లేఖ ఒకటి రాశారు.
అలాగే, జగన్ సొంత పత్రిక సాక్షిలో వచ్చిన కొన్ని కథనాల పట్ల పొగాకు రైతులు అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్కు, సాక్షి యాజమాన్యానికి ఓ లేఖ రాసారు. పొగాకు సాగు చేయని వారిని బాధితులుగా చూపించడం ఏమిటని నిలదీశారు. జగన్కు బ్లాక్ బర్లీ పొగాకు రైతుల కష్టాలు తెలుసా? పొగాకు రైతు కష్టాలను జగన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? అని రైతులు ప్రశ్నించారు.
తప్పుడు వార్తలతో రైతులు మనోధైర్యాన్ని దెబ్బతీసే కథనాలు రాయొద్దని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం తమ కోసం రూ.273 కోట్లను కేటాయించిందని వారు గుర్తుచేశారు. పర్చూరు, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, అద్దంకి నియోజకవర్గ రైతుల కోసం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆ లేఖలో స్పష్టం చేశారు. వాసత్వాలు ఇలా ఉంటే సాక్షిలో అసత్య కథనాలు రాస్తూ రైతులను అయోమయానికి గురిచేయడం ఆవేదన కలిగిస్తోందని వారు ఆరోపించారు.