Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోటకు తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం : మంత్రి కందుల దుర్గేష్

Advertiesment
kandula durgesh

ఠాగూర్

, ఆదివారం, 13 జులై 2025 (17:22 IST)
ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం తెలిపారు. తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొని కోట కట్టుకున్న మహానటుడు కోట శ్రీనివాసరావు అని అన్నారు. 
 
కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమన్నారు. కోట మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. విలన్‌గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయనాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నటుడన్నారు. 
 
ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేసిన నటుడన్నారు. నటనలో తెలుగునాట చెరిగిపోని ముద్ర కోట శ్రీనివాసరావన్నారు. ఆయన నటన చిరస్మరణీయమన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడిగా, తెలుగు రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా రాణించారన్నారు. 
 
తమిళనం, కన్నడం, హిందీ, మళయాలం తదితర భాషల్లో నటించి నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో పోషించిన ప్రతి పాత్రకు న్యాయం చేసిన మహానటుడు అన్నారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆయన నటించి మెప్పించి నంది, సైమా వంటి ఎన్నో సినీ అవార్డులు అందుకున్నారు.  
 
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం సైతం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిందన్నారు. కోట శ్రీనివాసరావు మృతిపై ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు - చంద్రబాబు - పవన్ నివాళులు