Publish Date: Fri, 08 Dec 2023 (14:54 IST)
Updated Date: Fri, 08 Dec 2023 (15:03 IST)
మిచౌంగ్ తుఫాను ప్రభావం కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తుఫాను బాధితులకు ఆయన శుభవార్త చెప్పారు. తుఫాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి రూ.2500 ఇస్తారని వెల్లడించారు. అలాగే, పంట నష్టపోయిన వారు కూడా బాధపడాల్సిన పనిలేదని, ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సీడీతో విత్తనాలు సరఫరా చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం మరో వారం రోజుల్లో కార్యరూపం దాల్చుతాయని, జిల్లా కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు.
తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. విద్యుత్ సరఫరాను తక్షణం పునరుద్ధరించేందుకు ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని కూడా రప్పించామని తెలిపారు. అదేవిధంగా రహదారలను బాగు చేసే కార్యక్రమాలు కూడా చేపడుతామని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎవరికైనా సాయం దక్కకపోతే 1902 అనే టోల్ ఫ్రీ నంబరుకు ఫోను చేస్తే తన కార్యాలయానికే కాల్ వస్తుందని ఆయన వెల్లడించారు.