Publish Date: Mon, 22 Nov 2021 (15:13 IST)
Updated Date: Mon, 22 Nov 2021 (15:15 IST)
అసెంబ్లీలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితం జరిగిన కేబినెట్ మీటింగులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో జగన్ ప్రకటించబోతున్నారు. రాజధానికి సంబంధించి కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మరోవైపు వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అమరావతి కేసులను విచారిస్తున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఈ విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నానిని మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రశ్నించగా... అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను బయటకు చెప్పడం నిబంధనలకు విరుద్ధమని... ఆ విషయం గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చెపుతారని అన్నారు.
వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, అక్కడే ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించారు.