Publish Date: Mon, 18 Sep 2023 (09:57 IST)
Updated Date: Mon, 18 Sep 2023 (10:28 IST)
జగన్మాత ముద్దుల కుమారుడు బొజ్జ గణపయ్య. ఆ స్వామిని పూజించనిదే ఏ కార్యమూ ప్రారంభించం. ఆయన ఆశీర్వాదం లేనిదే ఏ పనీ పూర్తికాగు. భారతీయులకున్న ముక్కోటి దేవల్లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరు ఇష్టదైవంగా ఉంటారు. కానీ, గణేశుడు మాత్రం అందరికీ కావాల్సిన వాడు. అందుకే వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికీ మహాయిష్టం.
బొజ్జ గణపయ్య ఏకదంతుడు ఎలా అయ్యారనేందుకు అనేక కథలు ఉన్నాయి. వినాయకుడికి మరో నామమే ఏకదంతుడు. ఈ పేరు రావడానికి ఓ కథ ఉంది. శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ద్వారం వద్ద ఉన్న వినాయకుడు ఆయన్ను లోపలికి అనుమతించలేదు. అసలే పరశురాముడికి కోపమెక్కువ. అందులోనూ ఆకారంలో చాలా చిన్నగా ఉండే వినాయకుడు తనను అడ్డుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.
తన చేతిలో ఉన్న గొడ్డలిని బాలకుడి మీదకు విసిరేశాడు. ఆ గొడ్డలి సాక్షాత్తు పరశురాముడికి శివుడు ప్రసాదించిందే. తన తండ్రి అనుగ్రహించిన ఆ గొడ్డలికి ఎదురెళ్లడం ఇష్టంలేక గణేశుడు ఆ గొడ్డలికి నమస్కరించాడు. అప్పటికే అది వినాయకుడి ముఖం మీద దాడి చేసి ఓ దంతాన్ని ఖండించింది. దాంతో అప్పటి నుంచీ ఆయనకు ఏకదంతుడనే పేరు వచ్చింది.
అలాగే, మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వ్యాసుడు భారతాన్ని లిఖించడానికి అనువైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నప్పుడు వినాయకుడు ముందుకొచ్చాడట. కానీ వ్యాసుడికి ఓ షరతు పెట్టాడట. వ్యాసుడు ఎక్కడా ఆగకుండా భారతం చెబుతుండాలని కోరాడట. దానికి వ్యాసుడు అంగీకరించాడట. అలా వ్యాసుని వేగానికి తగిన విధంగా మహా భారతాన్ని లిఖించడానికి తన దంతాన్ని ఉపయోగించాడట. అప్పటి నుంచి ఆయన ఏకదంతుడిగా మిగిలిపోయాడని అంటారు. ఇలా వినాయకుడి దంతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.