రుద్రమదేవి నటీనటులు : అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, హంసానందిని, కృష్ణంరాజు, జయప్రకాష్రెడ్డి తదితరులు. దర్శకత్వం : గుణశేఖర్, నిర్మాత : రాగిణి గుణశేఖర్, సంగీతం : మాస్ట్రో ఇళయరాజా.
పాయింట్: పాఠ్యాంశాల్లో తెలియని కాకతీయ రాణి కథ.
ఊహించి కథలు రాసి చిత్రాలు చేయడం వేరు. వాస్తవాన్ని చిత్రంగా మలచడం వేరు. రెండోదానికి కష్టపడాల్సివస్తుంది. చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలంతోపాటు దీక్షగా ఆ బాధ్యతను పైన వేసుకుని సినిమాగా తీయడం సాహసమే... పాఠ్యపుస్తకాల్లో రాసిందే చరిత్ర అనే అప్పటి జనరేష్కూ రుద్రమదేవి గురించి ఇంకా పెద్దగా తెలీయలేదంటే.. ఇప్పటి జనరేషన్ను ఏమాత్రం తెలీదు. మహిళగా పుట్టడమే నేరమైన సమాజంలో ఆ మహిళ ప్రజల కోసం ఏం చేసిందనేది చిత్రంలోని పాయింట్. హిస్టారికల్ ఫిల్మ్గా 'ది వారియర్ క్వీన్' అనేది ఉపశీర్షికతో 'ఒక్కడు' గుణశేఖర్ చేసిన ప్రయోగం. మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి ఫిల్మ్గా వచ్చిన ఈ సినిమాను ఆయనే నిర్మించి ఎన్నో కష్టాలకోర్చి తీసిన ఈ సినిమాకు కెసిఆర్ వినోదపన్ను కూడా మినహాయింపు ఇవ్వడం కాస్త ఊరట. మరి ఆ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ :
13వ శతాబ్దంపు ఓరుగల్లు అంటే ఇప్పటి వరంగల్ను కాకతీయ రాజ్య వారసుడు గణపతి దేవుడు(కృష్ణం రాజు) పాలిస్తున్న రోజులు. వంశం కోసం పరితపిస్తాడు. ఆ సమయంలో పుట్టిన ఆడ శిశువును.. మంత్రి శివదేవయ్య(ప్రకాష్ రాజ్) సలహాతో మగబిడ్డ రుద్రవీరగా ప్రజలకు తెలియజేస్తాడు. అప్పటికే దాయాదులు హరిహర దేవుడు(సుమన్), మురారి దేవుడు(ఆదిత్య మీనన్)లు, శత్రురాజైన దేవగిరి యువరాజు మహాదేవ నాయకుడు(విక్రంజీత్) రాజ్యంపై దండెత్తి వశంచేసుకోవాలనే చూస్తుంటే వంశం వృద్ధిచెందడంతో కాస్త తటపటాయిస్తారు. ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా యుద్ధవిద్యల్లో ఆరితేరేట్లు తీర్చిదిద్దుతాడు. అదే తరుణంలో బందిపోటుగా పేరు తెచ్చుకున్న గోన గన్నారెడ్డి(అల్లు అర్జున్) కూడా రుద్రవీరతో పోరు కోసం సిద్దంగా ఉంటాడు. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి రుద్రవీర ఏం చేసింది? ఇందులో రాణా పాత్ర ఏమిటి? చివరికి రుద్రవీర రుద్రమదేవిగా ఎలా ప్రజలకు తెలిసింది? అనేది మిగిలిన సినిమాలో చూడాల్సిందే.
పెర్ఫార్మెన్స్:
చారిత్రాత్మక కథను అనుష్క భుజాలపై మోసింది. ఒక మెచ్యూర్ యువరాణిలా బాగా చేసింది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో కత్తి తిప్పడం, రిస్కీ స్టంట్స్ చేయడంలో హీరోలకు ధీటుగా నిలిచింది. ఇక అంతఃపురంలో రాణిగా తన అందచందాలతో ఆకట్టుకుంది. తర్వాత గోన గన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్. తెలంగాణా యాసలో ఆయన పలికిన డైలాగ్స్ కొత్తగా వున్నాయి. నా మొలతాడులో తాయెత్తు అనే ఊతపదం మాస్కు బాగా ఎక్కుతుంది. 'గమ్మునుండవో..' అంటూ సాగదీసి చెప్పే డైలాగ్ కూడా బాగుంది. మరో యువరాజుగా రానా సరిపోయాడు. మంత్రిగా ప్రకాష్ రాజ్, రాజుగా కృష్ణంరాజులు తమ పాత్రలకి న్యాయం చేస్తే సుమన్, ఆదిత్య మీనన్, విక్రంజీత్లు నెగటివ్ షేడ్స్ని బాగా చేసారు. మిగతా చిన్నచిన్న పాత్రల్లో చేసిన నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు తెరపై కాస్త గ్లామర్ని ఒలకబోశారు.
టెక్నికల్గా...
ఈ సినిమాకు సాంకేతికంగా చాలా కీలకం. ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి వేసిన సెట్స్ మనకు 13వ శతాబ్దాన్ని గుర్తుచేస్తాయి. అలాగే విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. 7 కోట గోడల నిర్మాణం, చివరి వార్ ఎపిసోడ్ దగ్గర వచ్చే ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలాగే చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. 3డి ఎఫెక్ట్ బాగుంది. అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాస్ట్రో ఇళయరాజా అందించిన పాటలు సినిమాకి హెల్ప్ కాలేదు, అలాగే ఆయన నేపధ్య సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. మ్యూజిక్ అనేది ఈ సినిమాకి మైనస్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కొన్ని తప్పిదాలు కన్పిస్తాయి. అంత సీనియర్ ఎడిటర్ ఇంత స్లోగా ఉండేలా ఓ ఎపిక్ డ్రామాని ఎడిట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. అప్పటితరానికి మ్యాచ్ అయ్యేలా నీతాలుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మాత్రం అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. పీటర్ హెయిన్, విజయ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నంతలో పర్వాలేదు.
విశ్లేషణ
సినిమా కనుక కొంత కృతకంగా వుంటుంది. అయితే మూలం మాత్రం అసలు గ్రంథాల్లో వున్న కథే. అందుకే ప్రారంభం ముందే ఈ రియల్ లైఫ్ కథలో ఏమన్నా చిన్నచిన్న తప్పులుంటే క్షమించాలి అని వేసారు కాబట్టి కథ గురించి ఏం మాట్లాడటం లేదు. కథనం కాస్త స్లోగా సాగడంతో సినిమా ఓ దశలో బోరింగ్గా అనిపిస్తుంది. మనకు తెలియని ఓ కథని చెబుతున్నప్పుడు అందులో ఎన్నో కొన్ని థ్రిల్స్ ఉండాలి. కానీ ఇందులో థ్రిల్స్ అనేవి లేవు. రుద్రమదేవి కథ మొత్తానికి ఒకే ఒక్క ట్విస్ట్ని రాసుకున్నారు, ఆ ట్విస్ట్ ఆడియన్స్ ఊహించదగినదే కావడం వలన చివర్లో పెద్ద కిక్ ఏమీ ఉండదు. గోన గన్నారెడ్డి పాత్ర రావడంతో ఒక్కసారిగా కథలో ఊపు వచ్చినట్లయింది. ఇక మధ్యమధ్యలో వరుసగా పాటలు వచ్చి సినిమా వేగాన్ని ఇంకా కిందకి పడేస్తాయి. అయితే అవి ఇప్పటి జనరేషన్కు ఏమాత్రం నచ్చవు. క్లెమాక్స్లో వార్ ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకుంది. నిత్యామీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు గ్లామర్ అట్రాక్షన్కే తప్ప సినిమాకి పెద్ద ఉపయోగపడని పాత్రలు.
డైలాగ్స్లో కావలసినంత వెటకారం, కామెడీ కూడా ఉంటాయి. అందుకే ఈ సీన్ అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ క్లైమాక్స్ దగ్గర వచ్చే వార్ ఎపిసోడ్లో చూపే సర్ప వ్యూహం, గరుడ వ్యూహం సీన్స్ బాగున్నాయి. అయితే ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ మొత్తం గుణశేఖర్ కాబట్టి... ఒక్కడే అన్ని బాధ్యతలు తీసుకుని సక్సెస్ అయ్యాడు. బాహుబలికి వందమంది పనిచేస్తే.. రుద్రమదేవికి ఒక్కడే ఒక్కడు గుణశేఖర్ చేసి చూపించాడు. ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకునేలా లేకపోయినా, ఫరవాలేదు అనిపించుకునేలా మాత్రం ఉంది. కథలో దమ్మున్న సినిమా అయినప్పటికీ కథనం మరియు డైరెక్షన్ కారణాల వల్ల యావరేజ్ అటెంప్ట్గా నిలిచిపోవాల్సి వచ్చింది. రొటీన్ కథల్తో విసిగిపోయిన ప్రేక్షకులకు ఇలాంటి చారిత్రక కథలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందులోనూ.. బాహుబలికి ముందుగా రిలీజ్ అయితే ఈ చిత్రం ఇంకాస్త కమర్షియల్గా గుణశేఖర్ను గట్టెంక్కించేది.