కొన్ని సినిమాలు టైటిల్ బట్టే వాటి విషయం ఏమిటో తెలిసిపోతుంది. తాండ్రపాపారాయుడు అంటే ఎమోషనల్గా ఫెరేషిషస్గా ఉంటుందని ఇట్టే కనిపెట్టవచ్చు. వరుణ్సందేశ్, పూర్ణ నటించిన 'నువ్విలా నేనిలా' అనే చిత్రం కూడా ఇద్దరు చెరో దిక్కుగా వుంటారనేది తెలిసిపోతుంది. 'మేం వయస్సుకు వచ్చాం' చిత్రానికి దర్శకత్వం వహించిన త్రినాథరావు చేసిన ప్రయత్నమే ఇది. మరి ఎలా వుందో చూద్దాం..
కథగా చెప్పాలంటే...
క్రిష్ (వరుణ్సందేశ్) అమెరికా రిటర్న్. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ బాధ్యతలు చూసుకుంటాడు. ప్రేమ అనేది ఓ గేమ్లాంటిదనే తత్త్వం అతనిది. అలాంటి వ్యక్తికి మహాలక్ష్మి (పూర్ణ) పరిచయవుతుంది. అదే కంపెనీలో ఉద్యోగిగా చేస్తుంది. తనంటే ఇష్టపడేవాడి కోసం పిచ్చిగా ఖర్చుచేస్తుంది. అది తెలిసిన క్రిష్.. అతనిది సరైన ప్రేమకాదు. మోసం చేస్తాడని సూచిస్తాడు. అనుకున్నట్లే అలాగే జరుగుతుంది. దాంతో ఆమెను మరింతగా రెచ్చగొడతాడు. దీంతో ఛాలెంజ్గా తీసుకుని క్రిష్ను ఎలాగైనా తనవైపు తిప్పుకోవాలని ట్రై చేస్తుంది. మరి అలా జరిగిందా? లేదా? అన్నది సినిమా.
విశ్లేషణ
ఇందులో ఆసక్తికరమైన పాయింట్ అనేది పెద్దగా కన్పించదు. ఇలాంటి లైన్ను నమ్మి సినిమా తీసిన నిర్మాతను అభినందించాలి. కంపెనీకి బాస్ అయినా కంపెనీ వ్యవహారాల్లో చురుగ్గా వుండే క్రిష్.. ప్రేమ విషయంలో ఎందుకింతలా ఎడమొహంగా వుంటాడో అర్థంకాదు. చివర్లో తనెందుకు ఇలా వుంటున్నాడో అని ప్రశ్నించుకుంటాడు కూడా. ఆందులో సరైన రీజన్ కన్పించదు. ఇప్పటి సినిమాల్లో తాగుడు కామన్గా మారిపోయింది. హీరోహీరోయిన్లు కలిసే సందర్బం, ఆటపట్టించే సందర్భాలు తాగుడికే ప్రాధాన్యత ఇస్తాయి. ఒక దశలో సినిమా ఎటువెళుతుందో అర్థంకాదు. ఇంటర్వెల్ వరకు కథ అర్థంకాదు. ద్వితీయార్థంలో సాగతీత కన్పిస్తుంది.
పాత్రలు, సన్నివేశాలు ఏమాత్రం క్లారిటీగా అనిపించవు. హీరోను సీరియస్గా వుండే చూపిస్తూ.. హుందా తనం ఆపాదించే క్రమంలో విసుగుపుట్టిస్తాడు. అతని నడక అంతా రోబోలా వుంటుంది. ఇలాంటివి వరుణ్ బాడీకి నచ్చవు. మరి ఇదే కొత్తగా వుందనుకున్నాడో ఏమో. వరుణ్ సినిమాలు హిట్ అయి చాలా కాలమైంది. కథల్లో సరైన క్లారిటీలేక పిచ్చిపిచ్చి కథల్తో దర్శకుల్తో సినిమాలు తీస్తే ఇలాగే వుంటుందనేందుకు ఇలాంటి చిత్రం ఓ వుదాహరణ.
ఇక హీరోయిన్గా నటించిన పూర్ణ గతంలో అల్లరి నరేశ్ సినిమాలో నటించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు పలికించలేకపోయింది. ఇందులో దర్శకుడిదే తప్పు. ఇక కామెడీ బ్యాచ్ వున్నా వారినుంచి సరైనదిరాబట్టుకోలేక పోయాడు. అందుకే కథ, కథనాలు బలహీనంగావ వుంటే వాటిని చూపించేటప్పుడు మరింత బలహీనంగా అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ పర్వాలేదు. కొత్తబంగారులోకం తర్వాత అంతటి కథాబలమున్న చిత్రం వరుణ్సందేశ్కు రాలేదు. హీరోగా ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదండే సెకండ్ హీరోగా చేసినా ఆశ్చర్యంలేదు.