ప్రిన్స్ మహేష్ బాబు 'ఖలేజా'లో 'ఖలేజా' ఎంత..?!!
నటీనటులు: మహేష్ బాబు, అనుష్క, తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, అలీ, రావు రమేష్, షఫీ, శ్రీరంజని తదితరులు. సంగీతం: మణిశర్మ, ఆడియోగ్రాఫిక్స్: మధుసూదన్ రెడ్డి, నిర్మాతలు: శింగనమల రమేష్ బాబు, సి.కల్యాణ్, పాటలు: సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ పాయింట్: చనిపోతున్న ఓ ఊరి ప్రజలకు టాక్సీ డ్రైవర్ దేవుడు ఎలా అయ్యాడు..? వారిని ఎలా కాపాడాడు..?మూడేళ్లుగా ఖలేజా సినిమా తీస్తూ ఉండేసరికి మహేష్ బాబు చిత్రం ఎలా ఉంటుందనే ఆతృత అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. ఆ ఆసక్తికి తెరదించుతూ మహేష్ బాబు ఖలేజా చిత్రం గురువారం విడుదలైంది. సరికొత్త గెటప్లో తాను కన్పిస్తానని చెప్పిన మహేష్ బాబు చెప్పినట్లుగానే కొత్తగా కన్పించాడు. గ్లామర్గా కన్పించాడు. దానితోపాటు సినిమా మొత్తాన్ని 'ఒక్కడు'లా తన భుజాలపై మోసేశాడు. కామెడీ కూడా ఎవర్నీ చేయనీయకుండా తనే చేశాడు. అది మొదటి భాగం వరకూ బాగానే ఉంది. సెకండాఫ్లో కూడా కొనసాగడంతో కథ ఏమిటో తెలిసేలోపే క్లైమాక్స్ వచ్చేస్తుంది. చిత్రమంతా చూశాక.. త్రివిక్రమ్ సంభాషణల తరహాలో కామెడీగా తీసి.. చివర్లో ఓ కథ అనుకున్నట్లుగా ఉంది. కథాగమనం ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్కు గురిచేస్తుంది. ఇక కథలోకి వెళితే... చదువు అబ్బని రిటైర్డ్ మాస్టర్ కోట శ్రీనివాసరావు మనవడు అల్లూరి సీతారామరాజు( మహేష్ బాబు). షార్ట్గా ఉండాలని తను రాజు అని పిలుపించుకుంటాడు. ఓ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. డ్రైవర్గా ఉన్నప్పుడు పలుచోట్ల సుభాషిణి(అనుష్క) పరిచయమవుతుంది. ఆమె మహేష్ కంటపడితే చాలు ఏదో ఒక కారు డ్యామేజ్ అవుతుంటుంది. ఇదిలా ఉంటే ఓసారి కారులో భూగర్భ పరిశోధనా డాక్టర్ను తీసుకెళతాడు. తను డ్రాప్ చేసిన కొద్దిక్షణాల్లో అతను హత్య చేయబడతాడు. ఇది చూసిని రాజును దుండగులు వెంటబడతారు. డాక్టర్తోపాటు మరో వ్యక్తి తన కారుపై పడి మరణిస్తాడు. అతని ఇన్సూరెన్స్ నిమిత్తం వచ్చిన 5 లక్షల సొమ్మును ఇచ్చిరమ్మని రాజు ఓనర్ ధర్మవరపు రాజస్థాన్ పంపిస్తాడు. మరోవైపు సుభాషిణిని తన వ్యాపారం నిమిత్తం జి.కె(ప్రకాష్ రాజ్) తన కొడుక్కి ఇచ్చి పెండ్లి చేయాలంటాడు. అతనితో హెలికాప్టర్లో వెళ్లిన ఆమె అతని దురుద్దేశం గ్రహించి పారిపోతుంది. అలా రాజస్థాన్లో తేలుతుంది. అక్కడ రాజు, సుభాషిణి కలుసుకుంటారు. ఆ క్రమంలో జి.కె మనుషులు రాజుపై దాడి చేస్తారు. వారిని తప్పించుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్న పాలిగ్రామ వాసులు చూసి కొన ఊపిరిలో ఉన్న రాజును రక్షిస్తారు. తన గ్రామాన్ని కాపడటానికి వచ్చిన దేవుడుగా భావిస్తారు. అయితే ఊరిలోని నీరు తాగడంతో పలువురు చనిపోతుంటారు. మెడికల్ క్యాంప్లు పెట్టినా జి.కె తన ప్రాబల్యంతో తీసివేయిస్తాడు. ఇది గ్రహించిన రాజు దీనిలో మర్మమేదో ఉందని గ్రహించి కూపీ లాగుతాడు. గ్రహాల్లోంచి ఊడిపడిన ఓ లోహం బంగారంకంటే విలువైంది ఆ ఊరిలో ఉన్నదని దాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నది జి.కె ప్లాన్. దీనికోసం ఊరిని స్మశానంగా మార్చి అక్కడ త్రవ్వకాలు ప్రారంభించాలనుకుంటాడు. ఇది తెలిసిన రాజు ఏం చేశాడు..? వారి సమస్యలు ఎలా పరిష్కరించాడు అన్నది సినిమా. ఈ కథే కాస్త కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. టామ్ క్యూరీ నటించిన హాలీవుడ్ సినిమాలోని టాక్సీ డ్రైవర్ పాత్రను, కొండల్లో కొన్ని తెగలు పూజించే దేవుడు ప్రతిమలో రహస్యం దాగి ఉందని తెలిపే మరో హాలీవుడ్ చిత్రంలోని పాయింట్నూ.. మగధీరలో 'నీ శత్రువు కన్పిస్తే పంచభూతాలు స్పందిస్తాయ'ని చెప్పే సెంటిమెంట్తోనూ కథను కలగలిపి ఒక రూపానికి తెచ్చినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. దాంతో మహేష్ బాబు చేసిన ఒన్ మేన్ ఆర్మీ కామెడీ మొదటి భాగంలో బాగున్నా రెండో భాగంలో అది కాస్తా మోతాదు మించినట్లుంది. మహేష్ బాబు సినిమా అంతా నడిపించాడు. గత చిత్రాలకు భిన్నంగా చలాకీగా, గ్లామర్గా కన్పించాడు. త్రివిక్రమ్ క్యాజువల్ సంభాషలతో హాస్యాన్ని పండించాడు. కామెడీ నేనే చేయాలి. ఇంకొకరు చేస్తే ఊరుకోననే డైలాగుతో మహేష్ బాబు చిత్రమంతా తనే మోస్తాననే డైరెక్ట్గా చెప్పినట్లుంది. అనుష్క పాత్ర గ్లామర్గా ఉంటుంది. రాజు, ఆమెను ఆటపట్టించే సన్నివేశాలు చిత్రానికి హాస్యాన్ని తెప్పిస్తాయి. వీరికి సునీల్, అలీ పాత్రలు తోడయ్యాయి. సీతారమశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి పాటల్లో సాహిత్యం బావున్నా... మణిశర్మ సంగీతం అంతగా అనిపించలేదు. ఓం నమోశివరుద్రాయ.. మకతిక మాయామశ్చింద్రం.. మినహా మిగిలిన పాటలు ఆకట్టుకోలేదు. రీరికార్డింగ్, ఆడియో సౌండ్ బాగున్నాయి. రాజస్థాన్లో మొదటి భాగం నడవడంతో పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. త్రివిక్రమ్ సంభాషణలు క్యాజువల్గా ఉన్నాయి. పిక్కల దాన్ని చూస్తుంటే.. అని అనుష్కతో మహేష్ అనడం... సన్నివేశపరంగా "నీ అబ్బ... నీ జీవితం.. నీ అమ్మ" అంటూ క్యాజువల్గా కామన్ పీపుల్ మాట్లాడుకునే సంభాషణలనే త్రివిక్రమ్ వాడాడు. అయితే ఆ తర్వాత సాగే స్టోరీలో సరైన పట్టు లేకపోవడంతో ఓ సిల్లీ పాయింట్తో దర్శకుడు తనదైన శైలిలో లాక్కువచ్చాడు. ఏదో బ్రహ్మాండం కనిపెడతాడన్నంత బిల్డప్ ఇచ్చి చివరికి తుస్సుమనిపిస్తాడు. మొత్తంగా మహేష్ నుంచి ఆశించిన స్థాయిలో ఈ చిత్రం లేదు. ఓన్లీ మహేష్ను బ్రహ్మానందం చేసే కామెడీ చేయించి కొత్తదనం చూపాడు దర్శకుడు. మొదటి భాగం సరదాగా ఉన్నా.. సెకండాఫ్లో కథలో పట్టులేదని తేలిపోయింది. ఏనుగు సామెతలా ఈ చిత్రం ఉందని అభిమానులే అనడం విశేషం. హైదరాబాదులో ఉదయం 8 గంటలకే ప్రత్యేక షోలు వేశారు. ఎక్కువ భాగం మహేష్ తమను నిరుత్సాహపరిచాడని చెప్పడం గమనార్హం. దసరా పండుగ వరకూ సినిమా ఓకే. ఆ తర్వాత ఆలోచించాలి.