అమ్మ మృతిపై అనుమానాలున్నాయ్.. నివృత్తి చేయండి.. మోడీకి నటి గౌతమి లేఖ
కోట్లాది మంది ఆరాధ్యదైవంగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయనీ, వీటిని నివృత్తి చేసేందుకు లోతుగా దర్యాప్తు జరిపించాలని సినీ నటి గౌతమి డిమాండ్
కోట్లాది మంది ఆరాధ్యదైవంగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయనీ, వీటిని నివృత్తి చేసేందుకు లోతుగా దర్యాప్తు జరిపించాలని సినీ నటి గౌతమి డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు.
జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత... 75 రోజుల పాటు చికిత్స పొందుతూ ఈనెల 5వ తేదీన గుండెపోటుతో మరణించిన విషయంతెల్సిందే. అయితే, జయలలితకు అందించిన చికిత్సపై 75 రోజుల పాటు అత్యంత గోప్యత పాటించారు. దీంతో అమ్మ మృతిపై పలువురు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలో నటి గౌతమి కూడా చేరింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలు ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె ఓ లేఖ రాశారు. దీన్ని తన బ్లాగ్లో పెట్టారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఎందుకు అన్ని రోజులు గోప్యత పాటించారు? ఏ అధికారంతో ఆమెను కలవకూడదంటూ ఆంక్షలు విధించారు? ఆమె చికిత్సకు సంబంధించి ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇలాంటి ప్రధానమైన అంశాలను గౌతమి తన లేఖలో ప్రస్తావించారు.
ప్రధాని ఈ విషయంపై స్పందించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృతి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గౌతమి సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని ఆమె అన్నారు. కాగా, నటుడు కమల హసన్తో విడిపోతున్నట్లు ఇంతకుముందు ఆమె తన బ్లాగ్లో పోస్టు పెట్టిన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.