సరిగ్గా 18 యేళ్లు నిండి 30 రోజులు కూడా కాలేదు. కానీ తన ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఇంతకీ ఆ యువతి ఎవరో తెలుసా. ఆడపిల్లనమ్మా అంటూ అమ్మాయిల కష్టాలను పాట రూపంలో ప్రపంచానికి చాటిన తెలంగాణ వర్తమాన గాయని మధుప్రియ.
ఇపుడు ఈ యువతి ప్రేమ వ్యవహారం పోలీసు స్టేషన్కు చేరింది. తాను మేజర్నని, తన పెళ్లిని తనకు ఇష్టమైన వాడిని పెళ్ళి చేసుకునేందుకు తల్లిదండ్రులు అడ్డుచెబుతున్నారని ఆరోపిస్తూ... పోలీసు స్టేషన్ గడప తొక్కింది. దీంతో ఇంత చిన్న వయసులోనే పెళ్లేంటని తల్లిదండ్రులతో పాటు.. ఇరుగుపొరుగువారు వాదించినా పట్టించుకోవడం లేదు. తనకు తన ప్రియుడే కావాలంటూ మొండిపట్టుపట్టింది. ఆ ప్రియుడి పేరు శ్రీకాంత్.
హైదరాబాద్లో ఓ రియల్ ఎస్టేట్ యజమాని కుమారుడు అని కొందరు అంటుంటే.. మరికొందరు ఆ కంపెనీలో చిరుద్యోగి మాత్రమేనని చెపుతున్నారు. ఏది ఏమైనా.. మధుప్రియ, శ్రీకాంత్ల మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే విషయాన్ని పరిశీలిస్తే... గతంలో శ్రీకాంత్ కొన్ని షార్ట్ ఫిలింలను తీసేవాడట. వీటిల్లో కొన్నింటిలో మధుప్రియ ప్రధాన పాత్రల్లో నటించింది కూడా.
ఆ సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించినట్టు సమాచారం. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నప్పటికీ, తాను మేజర్ అయిన తర్వాత మాత్రమే విషయం బయటపెట్టాలని ముందే మధుప్రియ నిర్ణయించుకుని ఆగినట్టు తెలిసింది. ఇప్పుడీ పెళ్లిని ఆపాలని మధుప్రియ తల్లిదండ్రులు, ఎలాగైనా తాము ఒకటి కావాలని ప్రేమజంట ప్రయత్నించే క్రమంలో ఈ వ్యవహారం పోలీసు స్టేషన్కు చేరింది.
అయితే, శుక్రవారం ఉదయం 11.20 గంటలకు వీరిద్దరి పెళ్లి కాగజ్నగర్లోని వాసవీ గార్డెన్స్లో జరగాల్సి ఉంది. మధుప్రియ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో గురువారం రాత్రి మధుప్రియ తల్లిదండ్రులు, బంధువులు వరుడు శ్రీకాంత్ ఇంటిపై దాడి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి తాము అంగీకరించబోమని మధుప్రియ తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.