Publish Date: Mon, 26 Jul 2021 (07:48 IST)
Updated Date: Mon, 26 Jul 2021 (08:02 IST)
హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని ఓ ఆలయానికి ఓ యువకుడు దొంగతనానికి వచ్చాడు. తన పనిపూర్తి చేసుకున్న తర్వాత కాస్తంత బడలికగా ఉండటంతో ఓ కునుకు వేసి వెళదామని భావించాడు. కానీ, ఆ కనుకు కాస్త గాఢనిద్రలోకి జారుకునేలా చేసింది. నిద్రలేచి చూడగా, ఆ దొంగ కాస్త ఆలయ పూజారి కంటపడ్డాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చాంద్రాయణగుట్ట ఠాణాకు కూతవేటు దూరంలో శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న శ్రీరామాలయం ఆవరణలో సాయిబాబా, దుర్గాభవాని, స్వయంభువు ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. ఆదివారం సాయిబాబా మందిరం పూజారి తలుపులు తీయగా.. లోపల ఓ బాలుడు నిద్రపోయి కనిపించాడు.
వెంటనే ఆలయ కమిటీ ప్రతినిధి ప్రభాకర్రాజుకు సమాచారం ఇచ్చి, సదరు బాలుడిని నిద్రలేపారు. అతని వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా.. అమ్మవారి వెండి వడ్డాణం, త్రిశూలం, కత్తి, వస్త్రాలు కనిపించాయి. నిలదీయగా.. ఆలయంలో చోరీ చేశానని, నిద్ర రావడంతో ఇక్కడే పడుకున్నానన్నాడు.
సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్వర్మ, ఎస్సై కె.గోవర్ధన్రెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. అర్ధరాత్రి స్లాబ్ నుంచి మెట్ల మార్గం ద్వారా లోనికి ప్రవేశించిన బాలుడు సాయిబాబా ఆలయం వెనుక తలుపు ధ్వంసం చేశాడు.
హుండీ, అల్మారా తాళాలు పగులగొట్టి అమ్మవారి వెండి ఆభరణాలు తీసుకున్నాడు. బాలుడు రాత్రి 2 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. నిందితుడికి వైట్నర్ సేవించే అలవాటు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఠాగూర్
Publish Date: Mon, 26 Jul 2021 (07:48 IST)
Updated Date: Mon, 26 Jul 2021 (08:02 IST)