Publish Date: Sat, 24 Aug 2019 (10:32 IST)
Updated Date: Sat, 24 Aug 2019 (10:35 IST)
ఓ కట్లపాము ఆ కుటుంబం పై విషం చిమ్మింది. నిద్ర పోతున్న ముగ్గురిని కాటేసింది. వారిలో ఒకరు ప్రాణాలు విడువగా.. మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎరచెక్రు తండాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జాతోట్ రవి (38), అతని భార్య, కుమారుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఐదడుగుల కట్లపాము గత రాత్రి ముగ్గురినీ కాటు వేసింది. భర్త జాతోట్ రవి మృతి చెందగా.. భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వారిని తరలించారు. కట్లపాము అత్యంత విషపూరితమైందని స్నేక్ క్యాచర్లు చెప్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్య దేవిపల్లి గ్రామంలో పాముకాటుతో గంగారపు వెంకన్న అనే వ్యక్తి మరణించాడు. ముడురోజులక్రితం బోడ కాకరకాయలు కోస్తుండగా పాము కాటేసింది. చికిత్స నిమిత్తం బంధువులు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటిక్రితం మృతి చెందినట్లుగా సమాచారం.
నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎరచెక్రు తండాలో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పాము కాటుకు గురవడం. వారిలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. పాము కాటుతో ఒకే రోజు రెండు మరణాలు సంభవించడంతో కలకలం రేగింది.