ఈ నెల 12వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మినీ మేడారం జాతర జరుగనుంది. ఈ సందర్భంగా మేడారం వనదేవతులు సమ్మక్కసారలమ్మకు ప్రత్యేక పూజలు చేసేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మేడారం జాతరకు 10 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై ఆమె సంబంధిత అధికారులతో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.
ముఖ్యంగా, జాతర సమయంలో గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాటలు, చోరీలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. ప్రధానంగా జంపన్నవాగు, గద్దెల ప్రాంత, మేడారం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించాలని ఆదేశించారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చినా పార్కింగ్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.