28న శ్రావణ సంకట హర చతుర్ధి: కాణిపాకంకు వెళ్లండి...!
శ్రావణ మాసంలో వచ్చే సంకటహర చతుర్ధినాడు వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలసిన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామిని శ్రావణ మాసంలో వచ్చే సంకట హర చతుర్ధినాడు దర్శించుకోవడం శుభప్రదమని పురోహితులు చెబుతున్నారు. అలాగే సంకట హర చతుర్ధి నాడు సంకట హర వ్రతమాచరించడం శుభఫలితాలనిస్తుంది. ఇదే రోజున వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించేవారికి సంతాన ప్రాప్తి, కుజ దోష నివారణ, జ్ఞాన ప్రాప్తి, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, గురుభగవానుని అనుగ్రహము వంటి శుభ ఫలితాలుంటాయని పురోహితులు చెబుతున్నారు. సంకట హర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వివాహ ఆటంకాలు తొలగి పోవడం, దూరమైన బంధువులు తిరిగి ఒక్కటవ్వడం, జాతకదోషాలు తొలగిపోవడం జరుగుతుంది.సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం వినాయకుడిని కీర్తిస్తుంది. అందుచేత శ్రావణ మాసంలో వచ్చే సంకట హర చతుర్ధి నాడు వినాయకుడిని అర్చించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని విశ్వాసం. కాబట్టి ఈ నెల 28వ తేదీ (శనివారం) వచ్చే సంకటహర చతుర్ధి నాడు నిష్టతో ఉపవాసముండి, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం మంచిదని పురోహితులు చెబుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామములో వెలసిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడు స్వయంభువుగా భక్తులకు అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతోంది. వరసిద్ధి వినాయకుడిని భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా సేవించడం విశేషం. కాణిపాకం పుణ్యక్షేత్రం విశేషాలేంటో తెలుసా? చారిత్రక ప్రాధాన్యం గల కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయకుడు చాలా మహిమగలవాడుగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్ర ఆవరణలో ఎలాంటివారైనా అబద్ధం చెప్పడానికి వెనకడుగు వేస్తారు. తాను తప్పు చేయలేదని కాణిపాకం గుడిలో ఎవరైనా ప్రమాణం చేస్తే అతనిపై నేరారోపణ మోపినవారు సైతం ఆ మాటను విశ్వసిస్తారంటే స్వామివారి మహిమను అర్థం చేసుకోవచ్చు. దేశంలోని నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల్లో చాలామంది కాణిపాకం వినాయకున్ని సైతం దర్శించడం ఆనవాయితీగా మారడంతో ఈ క్షేత్రానికి నిత్యం భక్తుల తాకిడి ఉంటోంది. కాణిపాకంలో స్వయంభుగా వెలసిన వినాయకుని మహిమల గురించి ఆ ప్రాంతంలో కథలుగా చెబుతారు. అసలు కాణిపాకంకు ఆ పేరు రావడం వెనక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం కాణిపాకంలో నివశించే ముగ్గురు సోదరులకు ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అవిటితనం ఉండేది. వ్యవసాయం వృత్తిగా జీవించేవారు పొలం పనుల కోసం ఓ రోజు బావి త్రవ్వడం ప్రారంభించారు. బావి త్రవ్వుతున్న సమయంలో వినాయకుని విగ్రహం బయటపడింది. అయితే బావి త్రవ్వుతున్న గడ్డపార స్వామివారికి తగలడంతో విగ్రహం నుంచి రక్తం ధారావాహికంగా కారడం ఆరంభించింది. దీంతో బావి మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆ రక్తం తగిలిన అవటివారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం తెలిసిన ఊరిజనం స్వామివారి దర్శనానికి వేలాదిగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు స్వామివారికి కొట్టిన టెంకాయల్లోని నీరు ఓ కాలువలాగా ప్రవహించిందట. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని కాణిపాకం (తమిళంలో కాణిపారకం అంటే కొబ్బరినీరు ప్రవహించిన ప్రదేశం అని అర్ధం) అని వ్యవహరించడం పరిపాటిగా మారిందట. ఈ కథకు గుర్తుగా కాణిపాకంలో వినాయకుని విగ్రహం నేటికీ బావిలోనే ఉండడాన్ని చూడవచ్చు. అలాగే కాణిపాకంలో ఉండే స్వామివారు నిత్యం పెరుగుతూ ఉంటారని కూడా భక్తుల విశ్వాసం. కాణిపాకంకు ఎలా వెళ్లాలంటే..?చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో ఉన్న ఓ గ్రామమే కాణిపాకం. అయితే తిరుపతి నుంచి బెంగుళూరుకు వెళ్లే రహదారి మార్గానికి కొద్ది దూరంలోనే ఉండడంతో భక్తులు కాణిపాకంకు చేరడం చాలా సులభం. తిరుపతి నుంచి ప్రతి ఐదు నిమిషాలకు కాణిపాకంకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అలాగే జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి కూడా ప్రతి పది నిమిషాలకు కాణిపాకంకు బస్సు సౌకర్యం ఉంది. తిరుపతి నుంచి కాణిపాకంకు దాదాపు 70కిలోమీటర్ల దూరం ఉండగా, చిత్తూరు నుంచి కాణిపాకంకు దూరం 13 కిలోమీటర్లు మాత్రమే. రైలు ద్వారా కాణిపాకం చేరాలనుకునేవారు తిరుపతి లేదా చిత్తూరు చేరుకుని అక్కడి నుంచి కాణిపాకం చేరవచ్చు. కాణిపాకంలో ప్రస్తుతం వసతి సౌకర్యాలు సైతం బాగానే అందుబాటులో ఉన్నాయి.