Publish Date: Mon, 25 May 2020 (20:27 IST)
Updated Date: Tue, 26 May 2020 (18:42 IST)
కష్టాలను తీర్చుకోవడానికి మనము భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాము. మనము భగవంతుడిని కోరుకోగానే ఆ భాధలు తీరాలంటే అందుకు తగిన అర్హత భగవంతుడి దగ్గర మనం పొందాలి. అసలు ఆలయానికి వెళ్లినప్పుడు మనం ఎలాంటి మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి.
ప్రధానంగా ఆలయానికి వచ్చే భక్తుల ప్రవర్తన, ఆలయంలో పాటించాల్సిన అనేకమైన విధులు, నిషేధాలు భృగుమహర్షులవారు వివరంగా తెలియజేసియున్నారు. ఆ నియమాలను విధిగా ఆచరిస్తే భగవంతుని పరిపూర్ణకృపకు పాత్రులవుతాము అవి ఏమిటో తెలుసుకుందాం.
1. ఆలయాన్ని ప్రదక్షిణిగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైన మనస్సుతో నమస్కారం చేయాలి. మెల్లగా ప్రదక్షిణ చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి.
2. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం, ధ్వజస్ధంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ దాటకూడదు.
3. యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకొని కానీ, చెవికి తగిలించుకుని కానీ, అపసవ్యంగా వేసుకొని కానీ, లేదా దండ వలె ధరించి కానీ ఆలయప్రవేశం చేయకూడదు.
4. చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించకూడదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్దాలు చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట సత్యాన్ని దాచకూడదు.
5. దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తు కూర్చోకూడదు.
6. వస్త్రంతో కానీ, శాలువాతో కానీ శరీరం కప్పుకోవాలి.
7. దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోదిస్తూ దేవుని స్తుతించకూడదు.