మార్గశిర లక్ష్మీ వ్రతం ఎలా చేయాలో మీకు తెలుసా!?
, సోమవారం, 5 డిశెంబరు 2011 (13:34 IST)
మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఈ నెలలో ఏ గురువారమైనా చేసుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. పూజ చేసుకునేవారు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకోవచ్చు.గురువారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, పూజగదిని శుభ్రం చేసి కడిగి ముగ్గులు పెట్టాలి. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. బియ్యప్పిండితో ఎనిమిది దళాల పద్మాన్ని వేసి దానిమీద పసుపు కుంకుమలు జల్లి లక్ష్మీదేవిని నిలిపేందుకు పీఠాన్ని ఉంచాలి. పీటపై లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఉంచాలి. అయిదు తమలపాకులు, అయిదు వక్కలు, అయిదు నాణాలు, అయిదు గరికపోచలు ఉంచాలి. దీపం వెలిగించి, ఐదు రకాల నైవేద్యాలను సమర్పించాలి. కొందరు అయిదు పిడకలను కూడా లక్ష్మీదేవివద్ద ఉంచుతారు. ఉద్దరిణితో నీటిని లక్ష్మీదేవిమీద చిలకరిస్తూ, పూవులు జల్లుతూ, అక్షతలు జల్లుతూ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ దేవిని స్తుతిస్తారు. చివరికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవి పూజను భక్తిగా చేసుకున్నవారికి అపార సంపదలు లభిస్తాయని, సుఖశాంతులు ప్రాప్తిస్తాయని చెప్పే అనేక నిదర్శనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.