Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యావత్ ప్రపంచంపై కుజస్తంభన.. తస్మాత్ జాగ్రత్త..!

మనదేశంపై కుజస్తంభన ప్రభావం అధికం: పి.ఎ. రామన్

Advertiesment
భవిష్యవాణి
WD
ఈ ఏడాది అక్టోబర్ మొదలుకొని 2010 మే వరకు కుజుడు కర్కాటక రాశి నందు స్తంభించి ఉండటం వల్ల యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా మనదేశానికి కుజ స్తంభన దోషం ప్రారంభమైందని ప్రముఖ జ్యోతిష్యవేత్త, శ్రీ కాళహస్తి దేవస్థాన సిద్ధాంతి డాక్టర్ పి.ఎ. రామన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు సైతం ఆర్థిక మాంద్యం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని రామన్ తెలిపారు.

ముఖ్యంగా తూర్పు, ఉత్తర దేశాల్లో అలజడులు, భద్రతాలోపం, పొరుగుదేశాలతో విభేదాలు తలెత్తడం, వాతావరణంలో అనూహ్యమైన మార్పులు వంటి దుష్ఫలితాలు నెలకొంటాయని కాళహస్తి సిద్ధాంతి పేర్కొన్నారు.

ఇందులో మనదేశానికి పుష్యమీ నక్షత్రం, కర్కాటక రాశి నందు స్వాతంత్ర్యం సిద్ధించడం వల్ల ఈ కుజ స్తంభన దోష ప్రభావం అధికంగా ఉంటుందని రామన్ అన్నారు. దీనివల్ల యువతలో సైతం కాళ్ళు, చేతులు, భుజాలు నొప్పులు, నరాలు, ఎముకలు బలహీనం కావడం, వింత వ్యాధులు ప్రబలడం వంటి చికాకులెదురవుతాయని చెప్పారు.

అలాగే విద్యార్థినులు, స్త్రీలపై అకృత్యాలు, బలవన్మరణాలు, శాంతి భద్రతల లోపం, ఆహారం కొరత వంటి తదితర సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని రామన్ పేర్కొన్నారు. తరచు రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు సంభవించడం, నిత్యావసర వస్తువుల కొరత, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలు దుర్భర జీవితం గడపడంతో పాటు దోపిడీలు, చోరీలు వంటి దుస్సంఘటనకు ఎదుర్కోవలసి వస్తుందన్నారు.

తూర్పు భారతదేశంలో అసాంఘిక శక్తులు చెలరేగడం, విద్రోహక చర్యలు పెచ్చరిల్లి యుద్ధ వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యవేత్త రామన్ తెలిపారు. రాజకీయ వర్గాల్లో సైతం అవగాహన లోపం, అసమ్మతి, అల్లర్లు వంటి తదితర సమస్యలు అధికమవుతాయన్నారు.

ఈ దోష నివారణకు ప్రజలు ఐక్యత, సోదరభావంతో మెలుగుతూ సిద్ధిగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలను ఆరాధించడం, రాహుకేతువుల పూజలు చేయడం ద్వారా ఈ కుజస్తంభన దోష దుష్ఫలితాలను అధిగమించవచ్చునని రామన్ సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu