అగ్రరాజ్యం అమెరికాకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చిన వికీలీక్స్ వెబ్సైట్ మరో సంచలనానికి నాందిపలుకనుంది. స్విస్ బ్యాంకులో కోట్లాది రూపాయల నల్లధనాన్ని ఇబ్బడిముబ్బడిగా దాచుకున్న నల్లధనం కుబేరుల జాబితాను బయటపెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో మన దేశానికి చెందిన 40 మంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ బ్యాంకుల్లో 75 లక్షల కోట్ల రూపాయల మేరకు నల్లధనం మగ్గిపోతున్నట్టు వికీలీక్స్ సంస్థ యజమాని జూనియన్ అసాంజే వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు స్విస్ బ్యాంకు ఖాతాదారుల గుండెల్లో రైళ్లుపరుగెత్తించేలా చేస్తున్నాయి.
నిన్నమొన్నటి వరకు అమెరికాను దౌత్య ప్రపంచ చేష్టలను ప్రపంచానికి చాటిచెప్పి అంతర్జాతీయ సమాజం ముందు ఒక నిందితునిగా నిలబెట్టి దాని పరువుతీసిన వికీలీక్స్.. ఇపుడు నల్లధన కుబేరుల జాబితాను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. భారత్తో సహా వివిధ దేశాలకు చెందిన 2,000 మంది అక్రమార్కులు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాచుకున్న లక్షల కోట్ల రూపాయల గుట్టు రట్టుచేయడానికి నడుంబిగించారు.
స్విస్ బ్యాంకు మాజీ ఉద్యోగి సహకారంతో ఆయన కీలకమైన సీడీలను సంపాదించాడు. ఇందులోని సమాచారాన్ని క్రోఢీకరించే పనిలో ఆయన నిమగ్నమై వున్నారు. ఈ పనులు పూర్తయిన వెంటనే అంటే.. మరికొన్ని వారాల్లో ఈ జాబితాను వెల్లడించనున్నట్టు ప్రకటించారు. భారత్కు చెందిన 40 మంది శ్రీమంతుల సంగతులున్నట్టు ఎలక్ట్రానిక్ మీడియా వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది.
భారత్కు చెందిన పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు దాచిన నల్లడబ్బు రూ.75 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఇటీవల కథనాలు వెలువడిన విషయం తెల్సిందే. స్విస్ బ్యాంకుల్లో దాదాపు 300 దేశాల నుంచి వచ్చిన నల్లధనం దాగుందని ఒక అంచనా. ఈ ఖాతాదారుల జాబితాను వెల్లడించేందుకు స్విస్ బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశ దేశాల్లో ఎందరో సంపన్నులు.. పన్నులు ఎగ్గొట్టి, ముడుపులు మింగి అక్రమ మార్గాల ద్వారా స్విస్ బ్యాంకులకు చేర్చారు. ఈ సొమ్ము వివరాలకు సంబంధించినచ వివరాలను స్విస్ బ్యాంక్ జూలియస్ బేయర్లో మాజీ ఉద్యోగి రుడాల్ఫ్ ఎల్మార్ సోమవారం లండన్లోని ఫ్రంట్లైన్ క్లబ్లో మీడియా సాక్షిగా అందజేశారు. ప్రస్తుతం ఈ సీడీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పని పూర్తయిన వెంటనే జాబితానతు వెల్లడించనున్నట్టు అసాంజే వెల్లడించారు.