కొడుకు కోసం వైకాపాలో చేరనున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు!
, మంగళవారం, 8 మే 2012 (11:33 IST)
తన తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మారెడ్డితో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెస్) సమావేశమై పలు కీలకాంశాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలోని తెనాలి శాసనసభ స్థానాన్ని తన పెద్ద కుమారుడికి కేటాయించాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి ఆయన సూచన ప్రాయంగా సమ్మతించడంతో ఉమ్మారెడ్డి వైకాపా వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.