జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నేవేదిక హేతుబద్ధంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను బహిర్గతం చేసే నిమిత్తం కేంద్ర హోం మంత్రి చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రరాపా తరపున ఆయన పాల్గొన్నారు.
ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ ఇచ్చిన నివేదికను తాము ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తాము ముందునుంచి వాదిస్తున్నట్టుగానే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనల్లో ఒకటిగా ఉండటం శుభపరిణామమన్నారు.
రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తొలుత డిమాండ్ చేసింది తామేనని, ఆ కమిటీ చేసిన సిఫార్సులు తాము అనుకున్నట్టుగానే వచ్చిందన్నారు. అయితే, నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.