కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ పేరును సీపీఎం జాతీయ నాయకత్వం ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పదవి కోసం పోటీ పడిన 92 యేళ్ళ వీఎస్ అచ్యుతానందన్ను కాదనీ విజయన్ వైపే మొగ్గు చూపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గురువారం వెల్లడైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎల్డీఎఫ్ 91 స్థానాల్లో విజయభేరీ మోగించగా, అధికార యూడీఎఫ్ 26 స్థానాలు కోల్పోయి 47 సీట్లకే పరిమితమైంది. దీంతో ఎల్డీఎఫ్ తరపున కేరళ రాష్ట్ర 22వ ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విజయన్ ప్రస్తుతం సీపీఎం పాలిట్బ్యూరో సభ్యుడు. ఈ ఎన్నికల్లో గెలిచినవారిలో ఆయన ఒక్కరే పార్టీ పాలిట్బ్యూరో సభ్యుడు కావడం విశేషం.
అదేసమయంలో వీఎస్ అచ్యుతానందన్ (92)కు, విజయన్ (72)కు చిరకాల వైరం ఉంది. విజయన్ను సీఎం పదవికి ఎంపిక చేసినట్లు అచ్యుతానందన్కు సమాచారం చేసిన వెంటనే ఆయన ఆగ్రహంతో సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్ళిపోయినట్టు వినికిడి.
విజయన్ కన్నా ముందు కొద్ది కాలమైనా తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అచ్యుతానందన్ ఆశించినట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో ఆయన పార్టీకి కీలక ప్రచారకర్తగా వ్యవహరించారు. 140 స్థానాలున్న శాసనసభలో 91 స్థానాలు గెలుచుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది.
అయితే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అచ్యుతానందన్ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటితో పాటు.. అమరవీరులను కుక్కలతో కూడా పోల్చారు. దీనికితోడు 92 యేళ్ల వయసు. వీటన్నింటినీ బేరీజు వేసిన సీపీఎం అధినాయకత్వం విజయన్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.