డీఎంకే ఎమ్మెల్యేలంతా రాజీనామా? తమిళనాడులో రాష్ట్రపతి పాలన!
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణానికో విధంగా మారిపోతున్నాయి. దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళ చిరకాల స్వప్నం మరో 24 గంటల్లో నెరవేరుతుందనగా సుప్రీంకోర్టుతోపాటు.. రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్.విద్య
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణానికో విధంగా మారిపోతున్నాయి. దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళ చిరకాల స్వప్నం మరో 24 గంటల్లో నెరవేరుతుందనగా సుప్రీంకోర్టుతోపాటు.. రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఇచ్చిన షాక్తో మొత్తం చిందరవందరై పోయింది.
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా నిందితురాలే. ఈ కేసులో మరోవారం రోజుల్లో తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. మరోవైపు ముఖ్యమంత్రి పదవికి శశికళ అనర్హురాలని, అందువల్ల ఆమె ఆ పదవి చేపట్టకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో శశికళ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
మరోవైపు రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు కూడా శశికళకు తేరుకోలేని షాకిచ్చారు. ఆయన ఊటీ పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిపోయారు. పైగా, ఊటీలో ఉన్న తన కుటుంబ సభ్యులను సైతం ముంబైకు అత్యవసరంగా రప్పించారు.
ఇంకోవైపు తమిళనాడు విపక్ష నేత ఎంకే.స్టాలిన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా ఆయన ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపనున్నారు. ఇందులోభాగంగా, రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ల వద్ద శశికళ జాతకాన్ని విప్పనున్నారు.
అప్పటికీ దారికిరాకుంటే.. చివరి అస్త్రంగా డీఎంకేకు చెందిన 89 మంది ఎమ్మెల్యేలతో సామూహిక రాజీనామాలు చేయించాలన్న యోచనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. అంటే సభలో విపక్షానికి చెందిన సభ్యులంతా రాజీనామా చేయడం వల్ల అసెంబ్లీ మొత్తాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితు ఏర్పడనుంది. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేస్తే నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పరిస్థితులు రాష్ట్రపతి పాలన దిశగా సాగుతున్నట్టు తెలుస్తోంది.