సరదాగా ఎక్కి వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో 12 యేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలోని సుఖదాంబ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన ముగ్గురూ విద్యార్థులే. వారి స్కూలు సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కిన వెంటనే దాని స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
జల్ జీవన్ మిషన్లో భాగంగా, ఈ వాటర్ ట్యాంకును నిర్మించుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు. ఇది ప్రమాదం కాదని, ఇది నేరమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకును ఎంత నాణ్యతతో నిర్మించారో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని, కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్
గోమాతల్లో అయస్కాంత శక్తి (మాగ్నెటిక్ పవర్) ఉందని పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అన్నారు. గోసంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని భిల్వారాలోని శంభుపురా గ్రామంలో తులకి గోశాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోవులను గౌరవించడం మన సంస్కృతిలో భాగమన్నారు. గోవుల సంక్షేమం కోసం మరింత కృషి జరగాలని, పరిశోధనలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పూర్వం గోవులను సంరక్షించడం ద్వారా తల్లులు ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు.
గతంలో రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కటారియా.. గోవుల ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తిస్తుందని, ప్రతి ఇంట్లో వాటిని రక్షించే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవులను రక్షించకపోతే దేశంలో వ్యవసాయం నాశనమవుతుందని ఆయన అన్నారు. పాఠ్యాంశాల్లో గోవుల గురించి చేర్చకపోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అవినీతిని నిర్మూలించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహించడంపై దైవ సంకల్పమని కటారియా అభివర్ణించారు. గతంలో పేదలకు చేరాల్సిన నిధులు అవినీతి కారణంగా చేరలేదని ఆయన అన్నారు.