మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్జీ భద్రతాదళాల కాల్పుల్లో మరణించినట్టు బెంగాల్లోని పలు ప్రాంతీయ, జాతీయ ఛానెల్స్ గురువారం సాయంత్రం నుంచి వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. కాగా, కిషన్జీ మృతిపై మావోయిస్టు పార్టీ పెదవి విప్పడం లేదు.
పశ్చిమబెంగాల్ జిల్లా కుషిబోనీ అటవీ ప్రాంతంలో కిషన్జీతో పాటు.. అనేక మంది మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్టు భద్రతాదళాలకు సమాచారం అందింది. దీంతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టుల ఆచూకీని గుర్తించాయి. ఈ విషయాన్ని పసిగట్టిన మావోలు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఈ కాల్పుల్లో కిషన్జీ మృతి చెందినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్, కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర రావు మావోయిస్టు పార్టీలోని అగ్రనేతల్లో ఒకరు. అంచలంచెలుగా ఆయన పార్టీలో కీలక పదవులను అధిరోహిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, మావోయిస్టులకు మధ్య తారా స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. అంతేకాకుండా బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే కావడం గమనార్హం.