ఒబామా కొలువులోకి ఎన్నారై సురేష్ కుమార్..!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా యంత్రాంగంలో మరో ప్రవాస భారతీయుడికి కీలక పదవి లభించింది. క్లింటన్ ఫౌండేషన్కు ప్రత్యేక సలహాదారుగా సేవలందించిన భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు సురేష్ కుమార్కు.. వాణిజ్యశాఖ అదనపు కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫారిన్ కమర్షియల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్గా కూడా నియమిస్తూ ఒబామా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. తన పాలనా యంత్రాంగానికి శక్తిని అందించటంతోపాటు ప్రత్యేకతను తీసుకువస్తారనే విశ్వాసంతో, రాబోయే రోజుల్లో కుమార్తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ఈ మేరకు కుమార్ నియామం నేపథ్యంలో వైట్హౌస్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఇదిలా ఉంటే.. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య రంగంలో విశేషం అనుభవం కలిగిన సురేష్ కుమార్... కయ్జెన్ ఇన్నేవేషన్ అధ్యక్షుడిగా, మేనేజింగ్ పార్టనర్గా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించి.. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సహారా ఆఫ్రికా ప్రభుత్వాలతోపాటు.. అక్కడి కార్పొరేట్ సీఈఓలతో కలిసి పనిచేసిన విశేష అనుభవం కూడా ఈయనకు ఉండటం విశేషం.అలాగే.. జాన్సన్ అండ్ జాన్సన్ గ్రూప్ ఆపరేటింగ్ కమిటీలో పనిచేసిన అనుభవంతోపాటు.. వార్నర్ లాంబార్ట్, ఫైజర్లలో లాటిన్ అమెరికా వినియోగదారుల ఉత్పత్తుల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. టొరంటోలోని యార్క్ యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ సంయుక్త ప్రొఫెసర్గా కూడా పనిచేసిన కుమార్.. గ్లోబల్ మేనేజ్మెంట్పై పలు రచనలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ డిగ్రీ అందుకున్న కుమార్.. బాంబే యూనివర్సిటీలో ఎంబీఏను పూర్తి చేశారు. ప్రస్తుతం న్యూజెర్సీలోని ప్రిన్స్స్టన్లో నివసిస్తున్న ఈయన గతంలో ఆరు దేశాల్లో నివాసమున్నారు. కాబట్టి.. ఆయా దేశాల భాషల్లో చాలా అనర్గళంగా మాట్లాడగలరు కూడా..!