Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బలా బలా నా బండి.. పరుగులు తీసే బండీ...!!

Advertiesment
బాలప్రపంచం
FILE
కౌరవులు కట్టించిన లక్క ఇంటిలో పడి కాలిపోకుండా తప్పించుకున్న పాండవులు ఏకచక్రపురం అనే ఊరుకు చేరతారు. అక్కడ ఒకరి ఇంట్లో బ్రాహ్మణుల మాదిరిగా వేషాలు ధరించి తలదాచుకోసాగారు. ఇంటింటికీ తిరిగి తెచ్చుకున్న అన్నంతో తల్లి కుంతీదేవితోపాటు ఐదుగురు పాండవులు పొట్టపోసుకునేవారు.

ఏకచక్రపురం దగ్గరుండే కొండగుహలో బకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా బలవంతుడు, పెద్ద తిండిపోతు కూడా. ఊరిమీదపడి మనుషులను, జంతువులను తినేసేవాడు. అందుకని ఆ ఊరివాళ్ళందరూ కలసి ఆలోచించి ప్రతిరోజూ బండెడు అన్నం, రెండు దున్నపోతులు, ఒక మనిషిని బకాసురుడికి పంపేటట్లుగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఒకరోజు పాండవులున్న ఇంటివారి వంతు వచ్చింది. బకాసురుడికి ఆహారంగా ఎవరిని పంపించాలో తెలియక ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారు. అది చూసిన పాండవుల తల్లి కుంతీదేవి.. "నా కొడుకు భీముడిని బకాసురుడి వద్దకు పంపిస్తాను మీరు బాధపడకండి" అని చెప్పి వారిని ఓదార్చింది.

అయితే దానికి ఆ ఇంటివారు ముందు ఒప్పుకోలేదు. "భీముడు చాలా బలవంతుడు. చిన్నప్పుడు వాడు కొండరాతిపై పడితే ఆ రాయే పగిలిపోయింది. కనుక వాడు బకాసురుడిని చంపితీరుతాడని" కుంతీదేవి నచ్చజెప్పింది. దాంతో ఆ ఇంటివారు భీముడిని బకాసురుడి వద్దకు పంపేందుకు అంగీకరించారు.

దాంతో "బలా బలా నా బండి.. పరుగులు తీసే బండీ...!" అని పాడుకుంటూ భీముడు అన్నం బండితో బయలుదేరాడు. దారిలో బండెడు అన్నాన్ని తినేసి, బండిలోనే నిదురబోయాడు. బండి ఆలస్యంగా గుహ దగ్గరకు చేరింది. సమయం మించిపోయి వచ్చినందుకు బకాసురుడు ఆకలితో కేకలు వేస్తూ బండివద్దకు వచ్చి తొంగి చూశాడు. అందులో అన్నం లేదు, పైగా ఒక మనిషి నిదురబోతూ కనిపించాడు.

అంతే బకాసురుడికి కోపం రెండింతలైంది. గట్టిగా భీముడిని ఓ గుద్దు గుద్దేశాడు. మూమూలు మనిషయితే ఆ గుద్దుకే చనిపోయేవాడు. కానీ, భీముడి ఆ గుద్దుతో నిద్రమత్తు వదిలింది. బండిలోంచి ఎగిరి కిందకు దూకాడు. ఒక పెద్ద తాటిచెట్టును పెరికి దాంతో బకాసురుడిని బాదసాగాడు.

బకాసురుడేమీ తక్కువవాడు కాదు కాబట్టి... ఆ తాటిచెట్టును భీముడినుంచి లాక్కొని దాన్ని ముక్కలుగా విరిచి పారవేశాడు. అంతేగాక ఓ పెద్ద బండరాయిని ఎత్తి భీముడి నెత్తిపైకి విసిరాడు. అయితే భీముడు దాన్ని ఒకే ఒక గుద్దుతో పిండి, పిండి చేసేశాడు. ఇక ఇలా కాదని అనుకున్న బకాసురుడు ఏకంగా భీముడిపైకి దూకి కాళ్లతో తన్నుతూ, చేతులతో కొట్టసాగాడు.

ఆ సమయంలో భీముడు ఒడుపుగా బకాసురుడి రెండు కాళ్లనూ పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. అంతే ఊహించని ఆ దెబ్బకు బకాసురుడు రక్తం కక్కుకుని అక్కడికక్కడే చనిపోయాడు. విజయోత్సాహంతో ఏకచక్రపురం చేరుకున్న భీముడిని చూసి ప్రజలంతా జేజేలు పలికారు. బకాసురుడి పీడ విరగడైనందుకు ప్రజలంతా పండుగ చేసుకున్నారు. భీముడి మెడలో పూలమాలలు వేసి ఊరేగించారు.

Share this Story:

Follow Webdunia telugu