Publish Date: Thu, 16 May 2019 (18:21 IST)
Updated Date: Thu, 16 May 2019 (18:23 IST)
పిల్లల్లో చాలామందిలో ఎదుగుదల లోపాన్ని గమనిస్తుంటాం. పొట్టిగా సన్నగా ఉన్నవారిని చూస్తుంటాం. దీనికి ఒక కారణం వంశపారంపర్యం అయితే, మరో కారణం పౌష్టికాహార లోపం. సరైన ఆహారాన్ని తీసుకోకపోతే పేరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. టీనేజ్ ప్రాయంలో పెరుగుదలకు సంబంధించిన హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ ఏజ్లో మంచి పౌష్టికాహారం తీసుకుంటే ఎదుగుదలకు దోహదపడుతుంది.
ప్రతి రోజూ ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, కొన్ని మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట త్రాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. గుమ్మడికాయను మెత్తగా ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో కొద్దిగా పటిక బెల్లం పొడి, తేనెను కలిపి ఆల్పాహారం తీసుకునే ముందు రోజూ తింటే పొడవు పెరుగుతారు, కండరాలు బలంగా మారతాయి.
ఉసిరికాయను ప్రతిరోజూ తినడం వలన ఎత్తు పెరగవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి దోహదపడతాయి. రోజూ తీసుకునే ఆహారంలో బచ్చలికూర, క్యారట్, బెండకాయ, సోయాబీన్స్ చేర్చుకుంటే ఎత్తు పెరగవచ్చు. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉంటాయి.
ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటికబెల్లం తీసుకొని మెత్తగా పొడిచేసుకుని సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు గ్లాసు పాలలో ఒకస్పూన్ పొడిని కలుపుకొని త్రాగటం వలన బాగా ఎత్తుగా పెరుగుతారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వలన కూడా ఎదుగుదల, ఆరోగ్యం ఉంటుంది.