నేడు చాచాజీ పుట్టిన రోజు: హ్యాపీ.. 'చిల్డ్రన్స్ డే' ..!!
హాయ్.. పిల్లలూ.. చిల్డ్రన్స్ డే పండుగను హ్యాపీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా..! సరే ముందుగా మీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే..!ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు తెల్సుకుందాం..!పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నవంబర్ 14వ తేదీన జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఈ విషయాన్ని స్వయంగా చాచాజీ (నెహ్రూ పిల్లలు ముద్దుగా పిలుచుకునే పేరు)నే చెప్పారు. నవంబర్ 14వ తేదీని నా జన్మదినంగా గుర్తించవద్దనీ, ఆ రోజును "బాలల దినోత్సవం"గా గుర్తించాలని చాచాజీ చెప్పారు. అందుకే మనం చాచా నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం.తన పుట్టిన రోజును పసిపిల్లలకు పండుగ రోజుగా జరపాలని కోరుకున్న చాచాజీ జీవితం గురించి ఈ సందర్భంగా క్లుప్తంగా తెలుసుకుందాం. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14వ తేదీన అలహాబాదులో జన్మించారు. పుట్టుకతోనే ధనవంతుడైన ఈయన దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసి, మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి ఆయనకు రాజకీయ వారసుడిగా నిలిచారు.గొప్ప వక్తగా, విద్యావేత్తగా, మంచి తండ్రిగా పేరు గడించిన చాచాజీ.. స్వాతంత్ర్య పోరాట కాలంలో జైళ్లలో గడపటంవల్ల ఎక్కువకాలం భార్యా పిల్లలతో గడపలేకపోయారు. సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈయన.. భారత జాతీయ కాంగ్రెస్కు 4సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు.
బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పిన మహానుభావుడు మన జవహర్ లాల్ నెహ్రూ..! ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే దిశగా పాఠశాలలు పది రోజుల ముందు నుంచే ఈ వేడులను నిర్వహిస్తుంటారు. స్కూళ్లల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, కోలాహలంగా పిల్లలతో ఆడి, పాడించడం, వ్యాస రచన, వకృత్వ పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది.నేటి బాలలే రేపటి పౌరులు. మనదేశ భవితవ్యం బాలల మీద ఆధారపడి వుంది. వీరే గనుక సరైన మార్గంలో పయనిస్తే మన దేశ కీర్తి పతాకాపు రెపరెపలు ప్రపంచానికి కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యున్నత స్థానం మనకు లభిస్తుంది. అలా కాకుండా.. చెడు అలవాట్లతో, పెడ తోవలో పయనిస్తే.. వారి మనుగడకు ముప్పు తెచ్చుకున్న వారే కాకుండా.. దేశపు కీర్తి ప్రతిష్టలను నాశనం చేసినవారు అవుతారు. ఈ సత్యాన్ని గ్రహించిన వారిలో ప్రప్రధమ వ్యక్తి మన చాచాజీ.మరి నేటి బాలలను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది..? ముదుగా.. జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ఆ బాద్యత ఉంటుంది. అనంతరం విద్యాబుద్దులు నేర్పే గురువు మీద ఉంటుంది. వీరు పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దితే దేశం అన్ని విధాలుగా బలపడి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది. పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించని వాళ్లకు ఈ బాలల దినోత్సవం కనువిప్పు కలిగిస్తుంది.బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలు ఈ రోజున మిఠాయిలు పంచు కోవడమూ, ఉపాధ్యాయులు, పిల్లలకు చాచా నెహ్రూ జీవిత విశేషాలను చెప్పడమూ పరిపాటిగా ఉంటాయి. ఈ సందర్భంగా ఏర్పాటు సభాసమావేశాల్లో పలువురు ప్రముఖులు తమ జీవిత అనుభవాలను, జీవితంలో పైకి రావడనికి మనం చేయాల్సిన కృషి వంటి విశేషాలు చెబుతారు. వాటిని శ్రద్ధగా విని పాటించగలిగితే మనమూ వారంత ప్రముఖులం కాగలం.కాబట్టి పిల్లలూ.. శ్రద్దగా చదువుకొని మీరు చాచా నెహ్రూ గొప్పవాళ్లు కావాలని ఆకాంక్షిస్తూ... మరొక్కసారి మనమందరం చాచా నెహ్రూకి హ్యాపీ బర్త్డే చెబుదాం..! మీకు కూడా మరొక్కసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే.. చెబుతూ...మీ.. వెబ్దునియా