విజయనగరం జిల్లా, సాలూరు పట్టణానికి చెందిన రెడ్డి జీవన కిరణ్మయి "భారతీయ నాట్య మయూరి" అవార్డును కైవసం చేసుకుంది. జాతీయస్థాయి నృత్యప్రదర్శన పోటీలలో సబ్ జూనియర్ విభాగంలో కిరణ్మయి ప్రథమస్థానంలో నిలిచి, ఈ అవార్డును సాధించినట్లు... పట్రాయని సీతారామశాస్త్రి సంగీత నృత్య పాఠశాల ప్రతినిధి పి. వెంకటరావు తెలియజేశారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నాలుగు రోజుల క్రితం "కళానిలయం" సంస్థ ఆధ్వర్యంలో జాతీయస్థాయి నృత్యప్రదర్శన పోటీలను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న కిరణ్మయి కూచిపూడిలో "కృష్ణశబ్దం" అనే అంశంపై నృత్యప్రదర్శన ఇచ్చి, సబ్ జూనియర్స్లో ప్రథమ బహుమతిని దక్కించుకుంది.
దీంతో ప్రథమ స్థానంలో నిలిచిన కిరణ్మయికి "భారతీయ నాట్యమయూరి" అవార్డుతో సత్కరించారు. కాగా... ప్రస్తుతం లయన్స్క్లబ్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఐదో తరగతి పూర్తిచేసి, ఆరవ తరగతిలోకి ప్రవేశించనున్న కిరణ్మయి... పట్రాయని సీతారామశాస్త్రి సంగీత నృత్య పాఠశాలలో శిక్షణ పొందుతోంది.